తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలంగాణ రాష్ట్ర స్థానికతగల ఉద్యోగుల రిలీవ్ విషయంలో ఎట్టకేలకు చిక్కుముడి వీడిరది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 122 మంది నాన్గెజిటెడ్ ఉద్యోగులను అక్కడికి పంపాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీజేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణకు చెందిన 122 మంది ఉద్యోగులు రాష్ట్రానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.
పదేళ్ల నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. నాడు కమలనాథన్ కమిటీ చట్టబద్ధంగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి పంపాల్సిందిగా సిఫార్సు చేసింది. దీనిపై సుదీర్ఘకాలంగా టీఎన్జీవో సంఘం డిమాండ్ చేస్తోంది. తమను రిలీవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి హైదరాబాద్లో భేటీ నిర్వహించి… వివిధ సమస్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న వాటిని మినహాయించి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏపీలో పనిచేస్తున్న 122 మంది తెలంగాణ ఉద్యోగులను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. దీనిపై సానుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారంతా తమ కేడర్ చివరి ర్యాంకులోనే అక్కడ విధుల్లో చేరాల్సి ఉంది. ఈ బదిలీల సమస్య పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి అధ్వర్యంలో తెలంగాణ ఎన్జీవో నాయకత్వాన్ని కలుపుకుని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు. వాటిపై స్పందించి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ధన్యవాదాలు తెలిపారు.