సచివాలయ, వైద్య శాఖ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఎంపీపీ అనూష దేవి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో మన్య ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అదే క్రమంలో సచివాలయ, వైద్య శాఖ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ మన్య ప్రాంతంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు అల్పపీడన ప్రభావంతో మరో వారం రోజులకు పైగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లడమే గాక పంట పొలాలన్నీ జలమయమై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు సకాలంలో వరి నాట్లు వేయడానికి ఉపక్రమించినప్పటికీ తుఫాను కారణంగా పంట పొలాలలో అధికంగా నీరు చేరడంతో కొంతమంది రైతులకు నాట్లు వేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇటువంటి పరిస్థితులలో వ్యవసాయ శాఖ అధికారులు గిరి రైతులకు తగు సూచనలు, సలహాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన గృహాలు, పంట నష్టాలపై సంబంధిత శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. తుఫాను కారణంగా మురుగు కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోవడం వలన దోమలు వ్యాప్తి చెందడం, తద్వారా వ్యాధులు ప్రబలడం, రహదారులలో చేరిన బురద కారణంగా ప్రమాదాలు సంభవించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సమయంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రదేశాలలో దోమల నివారణకు గంబుషియా చేపలను వదలాలని సూచించారు. అదేవిధంగా వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యశాఖ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణం కారణంగా పలు గ్రామాలలో వర్షపు నీరు పోయే మార్గం లేక గృహాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయన్నారు. ఇటువంటి తరుణంలో త్రాగునీటి జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడిగా ఉన్న పదార్థాలను మాత్రమే భుజించాలని, చిన్నపాటి రుగ్మతలు ప్రబలితే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జీ కే వీధి ఎంపీపీ బోయిన కుమారి, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి లు ఉన్నారు.