చింతపల్లి, జీకే వీధి మండలాల వైకాపా శ్రేణుల అత్యవసర సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైకాపా శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా ఈనెల 27న భీమిలిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు తో కలిసి స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆ పార్టీ చింతపల్లి జికే వీధి మండలాల వైకాపా శ్రేణులతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా నిర్ణయించుకున్న 25వ తేదీ కార్యక్రమం రద్దు కావడంతో ఆ కార్యక్రమాన్ని 27వ తేదీకి మార్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, నాలుగు జిల్లాలకు సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. ఎన్నికల శంఖారావం పూరించే క్రమంలో భాగంగా తొలి కార్యక్రమం తూర్పున ఉత్తరాంధ్రలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నెల 27న భీమిలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. మూడు లక్షల మందితో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పాడేరు సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో వైకాపా హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, ఇందులో భాగంగానే భీమిలి లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మన్య ప్రాంతం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జీకే వీధి ఎంపీపీలు అనూష దేవి, కుమారి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, టైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, ఆ పార్టీ చింతపల్లి, జికే వీధి మండల అధ్యక్షులు మోరి రవి, బొబ్బిలి లక్ష్మణ్, మండల కన్వీనర్ పాంగి గుణబాబు, చింతపల్లి జీకే వీధి మండలాలకు చెందిన వివిధ పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.