విశాలాంధ్ర- ఉరవకొండ : అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం వర్తింపచేయాలని కోరుతూ ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామ సమీపంలో మంగళవారం రైతుల చేపట్టిన శాంతియుతమైన ఆందోళనలో పాల్గొన్న రైతులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడం శోచనీయమని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే. మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఆ పార్టీ నాయకులు సుల్తాన్, చెన్నా రాయుడు, రమేష్, తలారి మల్లికార్జున తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో పప్పు సెనగ, వేరుశనగ,కంది తదితర పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారని అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఒక శాతం కూడా పంట సాగు కానీ చీని, పత్తి పంటలకు మాత్రమే బీమా వర్తింప చేసిందని 90 శాతం రైతులు సాగుచేసిన పంటలకు వర్తింప చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిలువనా మోసం చేసిందని వారు పేర్కొన్నారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన రైతులపై ఏకంగా కేసులు నమోదు చేసి వారిని వేధించడం దుర్మార్గమైన చర్యని వారన్నారు రైతుల యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క బాధలు కష్టాలను తెలుసుకోవాలని గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన అన్ని రకాల పంటలకు కూడా బీమా సౌకర్యాన్ని వర్తింపచేయాలని రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.