విశాలాంధ్ర – పెద్దకడబూరు : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కించపరిస్తే సహించేది లేదని జనసేన పార్టీ మండల నాయకులు జిలకర గణేష్ హెచ్చరించారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై వాలంటీర్లు తీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. అసలు వాలంటీర్లకు పవన్ చేసిన వాఖ్యలు గురించి సరిగా తెలియకపోయినా, వైసీపీ పెద్దలు రెచ్చగొట్టి మరీ ధర్నాలు చేయిస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్వవస్థలో ఉన్న మచ్చుతునకలను చూపిస్తూ, కొందరు వైసీపీ పెద్దల అండదండలతో చేసే అసాంఘిక కార్యక్రమంలో ఎంతోమంది వాలంటీర్లు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. మొన్నటికి మొన్న మంత్రాలయం నియోజకవర్గంలోని చిర్తనకల్లు గ్రామంలో వాలంటీరు తల్లిని, బిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి అందరికీ తెలుసునని, ఇంతవరకు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని వారు ప్రశ్నించారు. అంతే కాకుండా చాలా మంది వాలంటీర్లు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు దమ్ము ధైర్యం ఉంటే ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు కావాలని, రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తీసుకో రావాలని ధర్నాలు చేయాలి గానీ, వాలంటీర్లలో కొంత మంది చేస్తున్న దారుణాలను ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా జనసేన ఓటు బ్యాంకును తగ్గించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర అని యువత తెలుసుకోవాలన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ ను కించపరిస్తే ఆయన అభిమానులుగా, జనసైనికులుగా ఊరుకోమని వారు హెచ్చరించారు.