విశాలాంధ్ర – పెద్దకడబూరు : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ హనుమంతప్ప సేవలు మరువలేనివని ఆర్ఎం పీవీ రమణ, సీనియర్ మేనేజర్ ఆదినారాయణ స్పష్టం చేశారు. అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ హనుమంతప్ప పదవీ విరమణ వేడుకలు మేనేజర్ రంగప్ప ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్ఎం పీవీ రమణ, సీనియర్ మేనేజర్ ఆదినారాయణతోపాటు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న మేనేజర్ హనుమంతప్ప సేవలను కొనియాడారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ గా హనుమంతప్ప విశిష్టశేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందారని ప్రశంసించారు. పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా శాంతియుతంగా వినియోగదారులతో మెలగడం హనుమంతప్పకే సాధ్యమన్నారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వ సాధారణమని అన్నారు. ఉద్యోగిగా తమ విధులను చిత్త శుద్ధితో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన హనుమంతప్పకు మున్ముందు భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాధించాలని కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన హనుమంతప్పను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ పాస్టర్ మనోహర్ బాబు, తెర్నేకల్ గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, మాజీ వీఆర్వో రామలింగారెడ్డి, బ్యాంకు వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది, హనుమంతప్ప కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.