ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి: ఆగ్రహించడం అంటే తిట్లకు లంకించుకోవడం. రెండు: అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం. ఈ రెండూ ప్రధానమంత్రి మోదీకి బాగా అలవాటైన విద్యలే. రెండో పద్ధతిలో ఆయనను మించిన వారు లేరు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలోని శివాజీ పార్కులో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించింది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన నిద్రావస్థలోకి వెళ్లిపోయిందని భ్రమపడ్డ వారందరి గాఢనిద్రను ఈ ర్యాలీ వదిలించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీని ప్రస్తావిస్తూ ‘‘శక్తి’’ అన్నారు. ఆయన ఈ మాటను వ్యంగ్యార్థంలో వాడారు. ఆయన ఉద్దేశించిన అర్థం మోదీ ‘‘దుష్ట శక్తి’’ అనీ, ‘‘నిరంకుశ శక్తి’’ అనీ కావొచ్చు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోదీ ధ్వంసం చేశారని దుయ్యబట్టే సమయంలో రాహుల్ ‘‘శక్తి’’ అన్న పద ప్రయోగం చేశారు. దీనితో మోదీకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టయింది. తెలంగాణలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ‘‘శక్తి’’ని అంతమొందిస్తామంటోందని కువ్యాఖ్యానం చేసి శివాలెత్తి పోయారు. రాహుల్ వాడిరది ఒక అర్థంలోనైతే మోదీ ఆ మాటకు మహిళలు అన్న అర్థం ఆపాదించి రాహుల్ మీద, మొత్తం ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన మీద దాడి చేయడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. తాను మహిళలను అంటే మాతృ మూర్తులను, ఆడ పిల్లలను ఎంత గౌరవిస్తానో ఊగిపోతూ చెప్పారు. మహిళలకు ఉన్న శక్తి ఏమిటో చెప్తూ ఈ నారీ శక్తిని ధ్వంసం చేసే వారి నుంచి మహిళలను రక్షించడానికి, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అన్నారు. ప్రధానమంత్రి ఎంత గొంతు చించుకున్నా ఆ సభకు హాజరైన మహిళలనుంచి అంతగా స్పందన కనిపించలేదు. మోదీ మొహంలో ఆదుర్దా మాత్రం స్పష్టంగా కనిపించింది. అబ్కీ బార్ చార్ సౌ పార్ అని మోదీ ఎంతగా ప్రచారం చేస్తున్నా నిజానికి ఆ మాట ఆయనను వెంటాడుతున్న ఓటమి భయాన్నే సూచిస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఆయనను భయకంపితుడిని చేస్తోంది. అందుకే రాహుల్ మాటలకు వక్ర భాష్యం చెప్పే కుట్రకు పాల్పడ్డారు. మోదీ అన్న మాటలు దక్షిణాది పర్యటనలో భాగంగా జరిగిన ఎన్నికల ప్రచారసభలో చెప్పడం వెనకా ఓ ఎత్తుగడ ఉంది. దక్షిణాదిలో బీజేపీ విజయంపై ఆయనకు అంత నమ్మకంలేదు. వాస్తవ పరిస్థితీ అదే. బీజేపీ మతతత్వ రాజకీయాలను దక్షిణాది ప్రజలు పట్టించుకోవడంలేదు. దక్షిణాదిలో గతంలోకన్నా ఎక్కువ సీట్లు సంపాదించగలిగితే తప్ప బొటాబొటి మెజారిటీతోనైనా గట్టెక్కి మూడోసారి ప్రధానమంత్రి కావడం అసాధ్యం అన్న ఆత్మజ్ఞానం మోదీకి ఉంది. అందుకే వక్రీకరణల మీద ఆధార పడుతున్నారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. గత ఏడాది మేలో కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు తాము గనక అధికారంలోకివస్తే బజరంగ్ దళ్ను, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఐ.ఎఫ్.)ను కట్టడి చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకేముంది మోదీకి వక్రభాష్యం చెప్పడానికి మహదవకాశం దొరికింది. కాంగ్రెస్ ప్రస్తావించిన బజరంగ్ దళ్ను కాస్తా బజరంగ్ బలి కింద మార్చేశారు. చూడండి బజరంగ్ బలిని జైలులో పెడతారట అని నానా యాగీ చేశారు. బజరంగ్ బలిని ఆరాధించే వారిని జైలులో పెడ్తారట, నిషేధిస్తారట అని కుట్రపూరిత ప్రచారానికి ఒడిగట్టారు. అయినా కర్నాటక ప్రజలు అంతవరకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ను గెలిపించారు. అది బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కావొచ్చు.
కిందటేడాది కర్నాటక ఎన్నికల ప్రచారంలో విద్వేషాన్ని పెంచుతున్న బజరంగ్ దళ్, పి.ఎఫ్.ఐ.తో సంబంధం ఉన్న వ్యక్తులపై గట్టి చర్య తీసుకుంటామన్న కాంగ్రెస్ మాటలకు వక్రభాష్యం చెప్పినట్టుగానే శివాజీ పార్కు సభలో రాహుల్ గాంధీ వినియోగించిన ‘‘శక్తి’’ అన్న మాటను విరూపంచేసి మహిళలను రెచ్చగొట్టడానికి మోదీ ప్రయత్నం చేశారు. మహిళల మీద అంత అభిమానం ఉన్న వ్యక్తే అయితే మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, అత్యాచారాలకు పాల్పడ్డప్పుడు అంతకు ముందు ఖతువా, హత్రస్లో మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మోదీ మహిళాభిమానాన్ని ఏ కలుగులో దాచారో! ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఆడకూతురు తనకు పూజ్యనీయురాలేనని నమ్మించడానికి ప్రయత్నించారు. తాను భారతమాతనూ పూజిస్తానన్నారు. ‘‘శక్తి’’ని అంతమొందిస్తామన్న ‘‘ఇండియా’’ కూటమి సవాలును స్వీకరిస్తున్నా అని గొంతు చించుకుని మరీ చెప్పారు. శివాజీ పార్కులో రాహుల్తో సహా ఎవరూ మహిళలను అవమానించే రీతిలో మాట్లాడలేదు. మోదీ నాయకత్వంలోని విద్వేష రాజకీయాల మీద, ప్రజలు ఎదుర్కుంటున్న నిరుద్యోగం, పేదరికం లాంటి అనేకానేక సమస్యల మీద ప్రతిపక్ష నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. వీటిలో ఒక్క ప్రశ్నకు కూడా మోదీ సమాధానం చెప్పలేదు. ఆయన దగ్గర సమాధానం ఉంటేగా! ‘‘శక్తి’’ అన్న పదానికి రకరకాల భాష్యాలు చెప్పారు. చంద్రయాన్ విజయవంతం అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, చంద్రయాన్ రోదసీ శకటం దిగిన చోటికి ‘‘శివ శక్తి’’ అన్న పేరు పెట్టామని గొప్పలు చెప్పుకున్నారు. శివశక్తి స్త్రీలింగ శబ్దం కాదని మోదీకి తెలిసి ఉండాలిగా! తెలియకపోతే ఆయన భక్తులైనా చెప్పాలిగా. మాటలో అర్థాన్ని మార్చేయడంలో మోదీ అద్వితీయుడు. నిష్కళంకమైన అబద్ధాలాడడంలో మోదీని మించిన వారు లేరు. నిజానికి రాహుల్ వాడిన ‘‘శక్తి’’ అన్న మాటకన్నా ‘‘మోదీ కేవలం డొల్ల మనిషి, ఆయనకు 56 అంగుళాల ఛాతీ లేదు’’ అన్న మాటలే మోదీ గుండెలో సూటిగా దిగి ఉంటాయి. మోదీ వక్ర భాష్యాలకు రాహుల్ గాంధీ సుదీర్ఘ వివరణే ఇచ్చారు. కాని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అలవాటు లేని మోదీ తప్పుడు మాటలను వెనక్కు తీసుకునే సంస్కారం ఎలా ప్రదర్శించగలరు! మోదీ ప్రయాస అంతా దక్షిణాదిలో ఎలాగైనా కొన్ని లోక్సభ స్థానాలైనా సంపాదించాలనే. అందుకే ఆయన పదే పదే దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. కేరళ, తమిళనాడులో కాలు మోపగలిగే చోటు కోసం కాళ్లరిగేట్టు తిరుగుతున్నారు. కర్నాటకలో ఇంతకు ముందు సంపాదించిన సీట్లు ఎటూ రావని మోదీకి తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం అంతంత మాత్రమే. ప్రతికూల వాతావరణంలో కొత్తగా దక్కే సీట్లేమీ ఉండకపోవచ్చు. అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రభావం దక్షిణాదిలో అంతగా కనిపించడం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో వక్రీకరణలకు మించిన అస్త్రాలు మోదీ దగ్గర ఏముంటాయిగనక!