హరియాణాలో నాలుగురోజులకింద మొదలైన మతోన్మాద చర్యలను జాట్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతం మేవాత్ జనం గతంలో ఎన్నడూ మతకలహాల జోలికి వెళ్లలేదు. అక్కడ ముస్లింల జనసంఖ్య ఎక్కువే కానీ వారు ఎప్పుడూ మతోన్మాదానికి దూరంగానే ఉన్నారు. పైగా స్వాతంత్య్ర పోరాటంలో మేవాత్ ప్రజలు హిందువులతో బుజం బుజం కలిపి పోరాడారు. ఇలాంటి చోట పనిగట్టుకుని బీజేపీ మతచిచ్చు రేపింది. దీన్ని జాట్లు సహించడం లేదు. మేవాతీ ప్రజలు తమ సోదరులు అంటున్నారు జాట్లు. జాట్లు మహా పంచాయత్ నిర్వహించి మతోన్మాదాన్ని తీవ్రంగా ఖండిరచారు. జాట్లు మత విద్వేషం ఉన్నవారు కాదనీ మేవాతీలకు వ్యతిరేకంగా తాము ఎలాంటి హింసాత్మక కార్యకలాపాల్లో భాగస్వాములం కాబోమని జాట్ల మహాపంచాయత్లో నిర్ణయించారు. ధన్ఖడ్ ఖాప్ పంచాయత్ సమన్వయకర్త డా.ఓం ప్రకాశ్ ధన్ఖడ్ ఈ విషయం స్పష్టం చేశారు. హిందూ మతోన్మాదులు పనిగట్టుకుని మేవాత్ పరిసర ప్రాంతాలలో హింసాకాండ రెచ్చగొట్టినందువల్లే మత కలహాలు జరిగాయని జాట్ల ఖాప్ పంచాయత్ నిర్ధారణకు వచ్చింది. హరియాణా మతకలహాలసెగ ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో హింసాకాండ ప్రేరేపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్లీ కూడా ఆ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం పొంచిఉంది. కానీ హరియాణా మతకలహాల పర్యవసానంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఈ కలహాలకు వ్యతిరేకంగా అనేకమంది గొంతెత్తడం సానుకూల పరిణామమే. దిల్లీ పొలిమేరల్లో ఏడాదిపాటు జరిగిన రైతుల ఉద్యమంలోనూ జాట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేతిలో లైంగిక దాడులకు గురైన మహిళా మల్లయోధులు దిల్లీలోని జంతర్ మంతర్లో సుదీర్ఘ కాలంపాటు ఉద్యమం నిర్మించినప్పుడు వివిధ రాష్ట్రాలలోని రైతులు, జాట్లు కదిలివచ్చి ఆ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. జాట్లను రెచ్చగొట్టడానికి సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ప్రయత్నం జరిగింది. అయినా జాట్లు చలించలేదు. విద్వేష ప్రచారానికి దూరంగానే ఉన్నారు. జాట్లు పూర్తిగా సెక్యులర్ సముదాయం అని జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి యుధ్వీందర్ సింగ్ అన్న మాటలు ఈ కల్లోల సమయంలో ఊరట కలిగిస్తున్నాయి. తాము ఏ తప్పుడు విధానాన్నీ సహించబోమని యుధ్వీందర్ ఖండితంగా చెప్పారు. హరియాణాలోని మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వం కనక సరైన చర్యతీసుకుని ఉంటే ఇంత హింసాకాండ చెలరేగి ఏడుగురు మరణించే వారేకాదని, డజన్లమంది గాయపడే వారుకాదని ఆయన అంటున్నారు. సంఘటన జరిగిన స్థలంలో ఆ సమయంలో పోలీసుల జాడే కనిపించలేదు. ఉన్నదల్లా హోం గార్డులే. వారు నిరాయుధులుగానే ఉంటారు. మోనూ మానేసర్, బిట్టూ బజరంగ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, వీడియోలు విడుదల చేసినా ఖట్టర్ ప్రభుత్వం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన జాడలేలేవు. నూప్ా జిల్లాలోని మేవాత్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దేవాలయానికి సంబంధించిన ఉత్సవం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కూడా మతోద్రేకాలు రెచ్చగొట్టే కుట్రలో భాగమే. నిజానికి ఈ శోభాయాత్రలు ఇంతకు ముందులేవు. మూడేళ్లుగా మాత్రమే కొనసాగుతున్నాయి. శ్రీరామ నవమి నవరాత్రుల సందర్భంగా బెంగాల్లోనూ ఇలాంటి శోభాయాత్రల సాకుతోనే కలహాలు రెచ్చగొట్టారు. జాట్లు తాము మతకలహాలకు వ్యతిరేకులమని బహిరంగంగా ప్రకటించడం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేయాలనుకుంటున్న సామాజిక సమీకరణలకు అడ్డుకట్ట వేయడానికి తోడ్పడుతుంది. విచిత్రం ఏమిటంటే మోనూ మానేసర్, బిట్టూ బజరంగ్ మీద ఇదివరకే హత్యలతో సహా అనేక ఆరోపణలున్నాయి. వారిని పట్టుకోవడంలో ఖట్టర్ ప్రభుత్వం విఫలమైంది. ఘర్షణలు జరిగిన మేవాత్ ప్రాంతానికి వస్తున్నామని వీరిద్దరూ ప్రకటించినా అనేక వాహనాల్లో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నా హర్యానా ప్రభుత్వం వారిని నిర్బంధించడానికి చేసిందేమీ లేదు. అంటే ఈ ఘర్షణలకు బీజేపీ ప్రభుత్వ మద్దతు ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జాట్లు మతోన్మోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించడానికి కారణం లేకపోలేదు. రైతు ఉద్యమం సందర్భంగా అనేక నిరాధార ఆరోపణలు మోపారు. వారిని ఖలిస్థాన్ మద్దతుదార్లు అన్నారు. జంతర్ మంతర్లో మహిళా మల్లయోధులకు మద్దతిచ్చినప్పుడూ జాట్లలో చీలికలు తేవడానికి భీకర ప్రయత్నం జరిగింది. 2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాట్లు బీజేపీకి పూర్తి మద్దతుఇచ్చిన మాటా వాస్తవమే. దీనివల్లే హరియాణాలో బీజేపీ ఘనవిజయం సాధించ గలిగింది. హరియానాలో అధికారంలోకి రాక ముందు బీజేపీని జాట్లకు వ్యతిరేక పార్టీ లేదా పట్టణ ప్రాంతాలకు పరిమితమైన పార్టీ అనేవారు. ఇటీవలి మతకలహాల సందర్భంగా జాట్లు హిందువుల తరఫున నిలబడాలని అనేక సందేశాలు సామాజిక మాధ్యమాలలో దర్శన మిచ్చాయి. బజరంగ్దళ్ ఈ ప్రయత్నం ఎక్కువగా చేసింది. కానీ జాట్ల నాయకులు ఈ విజ్ఞప్తులను ఖాతరు చేయలేదు. హింస ఏ సమస్యను పరిష్కరించదని ఓం ప్రకాశ్ ధన్ఖడ్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఖట్టర్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి కూడా హింసాకాండను సహించలేదు. శోభా యాత్ర నిర్వాహకులు పూర్తి వివరాలు చెప్పలేదన్నారు. ఈ శోభాయాత్రలో ఎంతమంది పాల్గొంటారో కూడా తెలియదంటున్నారు దుశ్యంత్ చౌతాలా. అంతేకాదు గుర్గావ్కు ప్రాతినిధ్యం వహించే, కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సింగ్ కూడ శోభాయాత్ర మీద విమర్శలు గుప్పించారు. శోభా యాత్రలో ఆయుధాలు ధరించే సంప్రదాయం ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. ఆయన వైఖరి మీద సామాజిక మాధ్యమాలలో విస్తృత చర్చ జరిగింది. బీజేపీ కుటిల విధానాలకు జాట్ల మద్దతు సమీకరించే ప్రయత్నం జరిగినట్టే రాజపుత్రుల సమర్థన సంపాదించే కృషి దండిగానే జరిగింది. కానీ ఈ రెండు సామాజిక వర్గాలకు ఈ కుతంత్రాలను సమర్థించలేదు.
హిందూ ధర్మం సంరక్షకులమని చెప్పుకుంటున్న వారు జాట్లను ములగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ ముజ్ఫÛర్నగర్ హింసాకాండను సమర్థించినందుకు జాట్లు ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నారు. జాట్ల నిర్ణయం దేశ వ్యాప్తంగా విస్తరించిన విద్వేష రాజకీయాలకు విరుగుడుగా పనిచేస్తుంది. హింసాకాండను రెచ్చగొట్టే వారి పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ ఉంటే పేదలను, కులసమీకరణలకు లొంగిన వారి సంతానం ఇక్కడే సరైన విద్యలేక కునారిల్లిపోతున్నారు. తమను మతకలహాలలో పావుగా వాడు కుంటున్నారని జాట్లు గుర్తించడం మంచి పరిణామం. మేవాత్ హింసా కాండలో మరణించినవారు మీ వాళ్లే అనిచెప్పి జాట్లను, రాజపుత్రులను ముగ్గులోకిదింపే ప్రయత్నమూ సాగుతోంది. కానీ జాట్లను టుక్డే టుక్డే గ్యాంగ్, టూల్ కిట్, ఖలిస్థాన్లని ముద్రవేసిన వాస్తవాన్ని జాట్ యువకులు క్రమంగా గ్రహించారు. గత పదేళ్ల కాలంలో జాట్లు ఎదుర్కొన్నన్ని సవాళ్లు మరే సముదాయమూ ఎదుర్కోలేదు. వారు అనేకసార్లు బీజేపీ చేతిలో మోసపోయారు. జాట్ యువకులు ఆర్.ఎస్. ఎస్. పన్నాగాన్ని పసిగట్టారు. ముస్లింలతో జగడం వచ్చినప్పుడు వారిని జాట్ హిందువులు అంటుంది ఆర్.ఎస్.ఎస్. కానీ జాట్లు తమ హక్కులకోసం పోరాడితే అమాంతం వారిని దేశద్రోహుల, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తారు. కానీ ఇప్పుడు జాట్యువకులు ఈ కుతంత్రా లను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఏ మతానికి చెందిన మతో న్మత్తులైనా కడిగినముత్యంలాంటి వారు కాదన్నది వారి అభిప్రాయం.