నేరస్థులను అంతమొందిస్తే నేరాలను నియంత్రించ వచ్చునన్నది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిద్ధాంతం. మేం రామ నామం జపిస్తాం కానీ నేరస్థులకు మాత్రం ‘‘రామ్ నామ్ సత్య్ హై’’ అంటే ఏమిటో చూపిస్తాం అంటున్నారాయన. రామ్ నామ్ సత్య్ హై అన్న మాట శవయాత్ర సందర్భంగా వాడే మాట. అంటే నేరస్థులను ఎన్కౌంటర్ చేసే స్తాం అని బహిరంగ హెచ్చరిక చేస్తున్నారు. ఎన్కౌంటర్లు చట్ట బాహ్యమైనవి అని ఆదిత్యనాథ్ భావించడం లేదు. నేరస్థుల విషయంలో అరెస్టు, విచారణ, చట్టం ప్రకారం శిక్షించడం అన్న ఊసే యోగీ ఆదిత్య నాథ్ నిఘంటువులో ఉండదు. కాల్చేయడం ఒక్కటే ఆయనకు తెలిసిన పద్ధతి. నేరాలకు విరుగుడు ఎన్కౌంటర్ అని ఆయన దృఢ విశ్వాసం. ప్రభుత్వం ఎన్ కౌంటర్లని ప్రకటించేవాటిలో 99 శాతం బూటకపు ఎన్కౌంటర్లే ఉంటాయి. ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు దానితో సంబంధం ఉన్న పోలీసులపై హత్యానేరం నమోదు చేసి విచారారించాలని అనేక కమిషన్లు సిఫార్సు చేశాయి. ఆ మాట పట్టించుకున్న సందర్భం ఒక్కటీ కనిపించదు. కాషాయంబరధారి అయిన యోగీ ఆదిత్యనాథ్ పట్టించుకుంటారని అనుకోవడం అత్యాశే. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి కనక యోగీ ఆదిత్యనాథ్ నేరస్థులను అంతమొందించడం గురించి మాట్లాడుతున్నారు. శుక్రవారం అలీగఢ్ లో బీజేపీ లోకసభ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నేరస్థులను ఎన్ కౌంటర్ చేసేస్తామని నదురు బెదురు లేకుండా చెప్పేశారు. కిందటి సంవత్సరం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారమే ఆ రాష్ట్రంలో 10,703 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో 178 మంది ‘‘రామ్ నామ్ సత్య్ హై’’ అయిపోయారు. ఈ నేరస్థుల ఆచూకీ తెలిపితే నగదు రూపంలో బహు మానంగా చెల్లిస్తామని చెప్పారు. ఇదీ అన్ని రాష్ట్రాలలో ఉన్న పద్ధతే. ఆదిత్య నాథ్ ఏలుబడిలో నేరస్థుల ఆచూకీ తెలిపితే రూ.75,000 నుంచి అయిదు లక్షల దాకా బహుమానాలు ప్రకటించారు. ఎన్ కౌంటర్ల ద్వారా వారికి ఆచూకీ తెలియజేసినందుకు పోలీసులే ఈ బహుమానాలు అందుకుని ఉంటారనడంలో సందేహమే అక్కర్లేదు. వీటిలో అత్యధిక భాగం బూటకపు ఎన్ కౌంటర్లేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చట్ట ప్రకారం నేరస్థులను, తీవ్రవాదులను అదుపు చేయడం చేత కానప్పుడు చాలా ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల మీదే ఆధారపడతాయి. తేడా ఏమిటంటే యోగీ ఆదిత్యనాథ్ ఆ మాట బహిరంగంగా చెప్పగలరు. చట్టబద్ధ పాలనతో తమకు నిమిత్తం లేదని నిర్మొహమాటంగానే అంటున్నారు. యోగీ ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన ఎన్కౌంటర్లలో 30 శాతం ఒక్క మీరట్ జిల్లాలోనే జరిగాయి. ఆదిత్య నాథ్ అధికారంలోకి వచ్చిన 2017 నుంచి 2023 మార్చి ఆరు నాటికి మీరట్లో 3,152 ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో 63 మంది నేలకొరిగారు. 1,708 మంది గాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యం అని యోగి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. పదివేల పై చిలుకు ఎన్ కౌంటర్లలో 4,911 మంది గాయపడ్డారు. మాఫియా ముఠాలను, నేరస్థులను ఇసుమంత కూడా సహించబోమని ఆదిత్య నాథ్ ప్రతిన బూనారు. ఇది ఉదాత్తమైన లక్ష్యమే. కానీ నేరాలను తగ్గించడానికి, నేరస్థులను అదుపు చేయడానికి యోగి ఆదిత్యనాథ్ అనుసరస్తున్న పద్ధతి నూటికి నూరుపాళ్లు చట్ట వ్యతిరేకమైంది. యోగీ అనుసరించిన ఎన్కౌంటర్ల విధానంవల్ల ప్రజల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. తాము ఎన్ కౌంటర్ల విధానం అనుసరిస్తున్నప్పటి నుంచి చాలా మంది నేరస్థులు రాష్ట్రం వదిలి వెళ్లి పోయారని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మునుపటి ప్రభు త్వాలన్నీ కలహాలు ప్రోత్సహించాయని ఆయన చెప్పారు. ఆయన దృష్టిలో కలహాలు అంటే మత కలహాలే అనుకోవాలి. ఒక్క యూ.పీ.లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా మత కలహాలు తగ్గినట్టు కనిపించవచ్చు. కానీ ముస్లింలను భయపెట్టడానికి హిందూ మతోన్మాదులు ఇటీవల మూక హత్యలు, మూక దాడులు అన్న కొత్త విధానానికి పదును పెట్టారు.
నేరస్థుల విషయంలోనే కాకుండ మోదీని తప్పు పట్టే వారి గురించి కూడా ఆదిత్య నాథ్ ఎన్ కౌంటర్ల భాషలోనే మాట్లాడగలరు. మునుపటి ప్రభుత్వాలు భయోత్పాతం కలిగించే పాలన అందించాయని యోగీ ఆరోపించారు. మోదీని వేలెత్తి చూపే వారు అభివృద్ధికి ఆటంకం కలిగించే వారేనని బులంద్ షహర్లో మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించేవారి అడ్డు తొలగించాలనే దాకా వెళ్లారు. ఆయనది యుద్ధోన్మాద భాష. బీజేపీ పాలనను, విధానాలను వ్యతిరేకించేవారి గురించి ఆయన మాట్లాడడం లేదు. మోదీని వ్యతిరేకించే వారు అభివృద్ధికి అడ్డంకి అంటున్నారు. వికసిత్ భారతం మోదీ గ్యారంటీ అంటున్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే మొదటి మూడేళ్లలోనే ఆర్థికాభివృద్ధిలో ప్రపంచ దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో ఉంటుందట. అభివృద్ధి చెందిన భారత్ అంటే ప్రతి మతం, ప్రతి వ్యక్తి, ప్రతి కులం వారికి పురోగమించడానికి అవకాశం ఉండడం అని యోగి చెప్తున్నారు. గత పదేళ్ల మోదీ పాలనలో ఈ చిలకపలుకులు ఏ మేరకు నిజమయ్యాయో దేశంలో పెరుగుతున్న అంతరాలను చూస్తే అర్థం అవుతుంది. అతి కొద్ది మంది చేతిలో మాత్రమే సంపద పోగు పడడం, మిగతా జనాభా ఆర్థికస్థితి హీనదశకు చేరడం, నిరుద్యోగం భరించ శక్యం కానిదై పోవడమే యోగీ చెప్పే అభివృద్ధి అయితే చేయగలిగింది ఏమీ ఉండదు – మోదీని గద్దె దించడం తప్ప. మోదీ హామీలపై జనానికి అపారమైన విశ్వాసం ఉందని కూడా యోగీ అంటున్నారు. కులతత్వం, వంశపారంపర్య పాలన ఉండదని కూడా ఆయన చెప్తున్నారు. ఆనువంశిక పాలనను బీజేపీ నేతలు ఎప్పుడు విమర్శించినా కాంగ్రెసే వారి దృష్టిలో ప్రధానంగా ఉంటుంది. కానీ వామ పక్షాలను మినహాయిస్తే ఇతర పార్టీలలోనూ అది తక్కువేమీ కాదు. బీజేపీలో ఆనువంశిక రాజకీయాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్నా మోదీ, ఇతర బీజేపీ నాయకులు, కాంగ్రెస్ ను, ఇతర బీజేపీయేతర పక్షాలను దుయ్యబట్టడంతోనే సరిపోతోంది. ఈ పదేళ్ల కాలంలో తాము సాధించింది ఏమిటో చెప్పే స్థితిలో లేరు. ఇప్పుడు మోదీ అడుగుతున్నదల్లా మూడో విడత అధికారం అప్పగించమనే. ఆదిత్యనాథ్ పనిగట్టుకుని మోదీ కీర్తిగానం చేయడం వెనక ఆంతర్యం లేకపోలేదు. ఆదిత్యనాథ్ ను తొలగించడానికి మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే మోదీని పొగిడి తన కుర్చీ కాపాడుకోవాలనుకుంటున్నారు. మొత్తం దేశవాసులు మోదీ గ్యారంటీలను నమ్ముతున్నారట. అలా అయితే 2019లో 63 శాతం ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేసినట్టో!