ప్రణాళికా సంఘం స్థానంలో ‘‘నీతీ ఆయోగ్’’ను ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం చివరకు దాన్నీ తమ రాజకీయ ప్రయోజనాల సాధనకు వేదికగా మార్చేసింది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మినహా మిగతా ఏడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతీ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. కానీ మమతా బెనర్జీ మాత్రం హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెను అయిదు నిముషాలకన్నా ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు. ఆమె మైక్ ఆపేశారు. దీనితో మమత ఆ సమావేశం నుంచి వాకౌట్చేసి బయటకు వచ్చారు. నీతీ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని తమిళనాడు, కర్నాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు ముందే నిర్ణయించుకున్నారు. నీతీ ఆయోగ్ సమావేశాలను కూడా ప్రతిపక్షాలవారు రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఇల్లెక్కి అరవొచ్చుగాక. కానీ మమతా బెనర్జీ ఈ సమావేశాలకు హాజరు కావడం వెనక మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టే ఆలోచన స్పష్టంగా కనిపించింది. ఆమె అక్కడ ప్రతిపక్ష వాణిని వినిపించడానికి ప్రయత్నించడం నీతీ ఆయోగ్ అధ్యక్షస్థానంలో ఉన్న మోదీకి నచ్చలేదు. వెంటనే ఆమె మైక్ ఆపేయించారు. ఒక్క ప్రతిపక్ష నేత మాట కూడా వినే సహనం లేనప్పుడు ఈ సమావేశాల ప్రయోజనం ఏమిటి? సరిగ్గా ఈ ఉద్దేశంతోనే ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ప్రభుత్వాలున్న ముఖ్యమంత్రులు ముందే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని ప్రభుత్వాలు బహిష్కరించి నిరసన తెలియజేస్తే మమతా బెనర్జీ హాజరై మోదీ ప్రభుత్వ నాటకాలను జనం దృష్టికి తీసుకురావడంలో సఫలమయ్యారు. నీతీ ఆయోగ్ సమావేశానికి హాజరైన ఒకే ఒక్క ప్రతిపక్ష ముఖ్యమంత్రి మాటనైనా వినే ఓరిమి మోదీ నాయకత్వంలోని నీతీ ఆయోగ్ సమావేశాలలో కనిపించలేదు. తనకు జరిగిన అవమానాన్ని భరించలేక జీవితంలో ఎన్నడూ ఈ సమావేశాలకు హాజరు కాను అని మమత ప్రకటించడం వెనక ఆగ్రహం మాత్రమే లేదు. మోదీ నిరంకుశ విధానాలను ఎండగట్టే ధైర్య సాహసాలూ ఉన్నాయి. శనివారం జరిగిన నీతీ ఆయోగ్ సమావేశం ఏం చర్చింది, ఏం నిర్ణయాలు తీసుకుంది అన్న దానికన్నా మమతా బెనర్జీ వ్యవహారమే ప్రధాన వార్తాంశం అయింది. ఇది ఆమెకే కాదు, మొత్తం ప్రతిపక్షాల విజయం. ప్రాంతీయపార్టీల ఆత్మ గౌరవం నిలబెట్టడంలో మమత సఫలమయ్యారు. మొత్తం ప్రతిపక్షాలవాణి ఇదేనని చాటి చెప్పగలిగారు. తమ పార్టీ అధికారంలోలేని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాట వినడానికి సిద్ధంగా లేని వాస్తవం నిరంకుశత్వానికే ప్రతీక. అహంకారం అపకారం చేస్తుంది అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ చెప్పిన మాటను కూడా పెడచెవిన పెట్టే స్థాయిలో మోదీ ప్రభుత్వ అహంకారం పెరిగిపోయింది. సమావేశం నుంచి వాకౌట్చేసిన తరవాత మమతా బెనర్జీ చెప్పిన మాటలు ఆలోచించదగినవి. నీతీ ఆయోగ్ను రద్దుచేసి మునుపున్న ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలన్న ఆమె అడగడంలో అర్థం ఉంది. ప్రాంతీయ పార్టీల, ప్రతిపక్షాల ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని మమతా బెనర్జీ స్పష్టంగానే చెప్పారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని రాష్టాలు నీతీ ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించినా మమతా బెనర్జీ హాజరు కావడాన్ని ఆసరాగా చేసుకుని ‘‘గోదీ మీడియా’’ మళ్లీ ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన విచ్ఛిన్నం అవుతోంది అన్న దుష్ప్రచారం యదేచ్ఛగా కొనసాగిస్తోంది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని ఒక్క నాయకుడు తుమ్మినా ఇదే అసత్య ప్రచారం కొనసాగించడం మోదీ ఒడిలో కూర్చోవడానికి అలవాటుపడినవారికి అలవాటై పోయింది. మమత వాకౌట్ చేయడానికి కారణం లేకపోలేదు. గోవా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు రెండిరటిని కలిపినా బెంగాల్ అంత ఉండవు. కానీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 20 నిముషాల పాటు ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినప్పుడు వివక్షలేదని వాదిస్తే కుదరదు. మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికి మోదీ సర్కారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. గ్రామీణ ఉపాధిహామీ పథకానికి నిధులు ఇవ్వడంలేదు. ఏదో రేషన్షాపుపై మోదీ ఫొటో లేదన్న కారణంగా అక్కడ రేషన్ సరఫరా ఆపేసి పేదల కడుపుమాడ్చింది మోదీ ప్రభుత్వమే. నీతీ ఆయోగ్ సమావేశాలను ఇదివరకు కూడా బహిష్కరించిన ముఖ్యమంత్రులున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టి.ఆర్.ఎస్. నాయకుడు చంద్రశేఖర్రావు కూడా బహిష్కరించారు. ఆ సమయంలో ఆయన ఆరుపేజీల లేఖరాసి తాను హాజరు కాకపోవడానికి కారణాలు తెలియజేశారు. మోదీ ప్రభుత్వం నీతీ ఆయోగ్ సూచనలను, నిర్ణయాలను ఆదరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి.
తమ ముఖ్యమంత్రులు నీతీ ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారన్న అంశాన్ని ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని పార్టీలు చాలా బలంగానే చెప్పాయి. అక్కడ జరిగేదల్లా 2047 నాటి వికసిత భారత్ ఎలా తయారవుతుందో చెప్పడమే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టడం కుదరదు. ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసినట్టు మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామన్న మాట పచ్చి బూటకం. ఇది కేటాయింపు కాదు. ఆ మేరకు రుణాలు ఇప్పిస్తామన్న హామీ మాత్రమే. బీహర్ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఈ రెండు రాష్ట్రాలకు చేశామంటున్న మేలును ప్రతిపక్షాలు తప్పుబట్టడంలేదు. వివిధ రాష్ట్రాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయింపులో వివక్ష చూపించారన్నదే ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం. ఇది వాస్తవం అని బడ్జెట్ కేటాయింపులను సునిశితంగా పరిశీలిస్తే నిజమేనని రుజువు అవుతుంది. కె.చంద్రశేఖరరావు హయాంలో అమలుచేస్తున్న నీటి పారుదల పథకాలు అమోఘమైనవని, వాటికి నిధులు అందజేయాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను మోదీ సర్కారు బుట్టదాఖలు చెసింది. అలాంటి నేపథ్యంలోనే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి నీతీ ఆయోగ్ సమావేశాలకు హాజరు కాలేదన్న వాస్తవాన్ని విస్మరించలేం. తమకు సరిపడని నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఆ నాయకుల మైక్లు ఆపేసే దుష్ట సంప్రదాయం మొదట మోదీ హయాంలో లోక్సభలో ప్రారంభం అయింది. క్రమంగా అది రాజ్యసభకు పాకింది. మోదీ పేరెత్తితేనే లోకసభ స్పీకర్ ఓం బిర్లా హడలి పోతున్నారు. ‘‘నో నో’’ అని గట్టిగా అరుస్తుంటారు. ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలలో గిట్టని భాగాలను రికార్డులనుంచి తొలగించడంలో రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కర్ సకల రికార్డులు బద్దలు కొట్టేశారు. మైకులు నిలిపేసే పద్ధతి ఇప్పుడు నీతీ ఆయోగ్కు కూడా అలవడిరది. ఇది హాస్యాస్పదం.