. టీడీపీ మూడో జాబితాపై తీవ్ర ఉత్కంఠ
. చంద్రబాబు నివాసానికి పోటెత్తుతున్న ఆశావహులు
. జనసేన, బీజేపీకి కేటాయించిన స్థానాల్లో అసమ్మతి జ్వాలలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో చోటు దక్కని ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 94 మందితో తొలి, 34 మందితో మలి జాబితా విడుదల చేయడంతో మూడో జాబితాలో చోటు కోసం అధినేతపై నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఇక 16 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆశావాహులు మాత్రం పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో చంద్రబాబు ముఖ్య నేతలతో కలిసి మూడో జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, సీట్లు, బీజేపీకి 10 సీట్లు కేటాయించారు. ఆయా స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీ నేతలకు ఓటు వేయమని చెప్పేదెలా? అని వారు అంతర్మథనం చెందుతున్నారు. ఇటువంటి స్థానాల్లో సీటు ఆశించిన నేతలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను జీవీ ఆంజనేయులు తీసుకొచ్చారు. శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పెదకూరపాడులో తెలుగుదేశం విజయానికి కలిసి పనిచేయాలని సూచించారు. ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరు రెండో జాబితాలో కూడా లేకపోవడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయన కూడా అధినేతను కలిశారు. రెండు జాబితాల్లోనూ చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పెనమలూరు ఇన్ఛార్జి బోడె ప్రసాద్ను బుజ్జగించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. కాకినాడ అర్బన్ టికెట్ ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానం పొత్తుతో ముడిపడి ఉందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో, సీనియర్ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీటు ప్రశ్నార్థకంగా మారింది. ఉమాకు పెనమలూరు సీటు కేటాయించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి సీటును ఆశ్రయిస్తున్న మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓటమి పాలవుతుండడంతో ఆయన స్థానంలో కోడలికి అభ్యర్థిత్వం ఖరారు చేసే యోచనలో ఉన్నారు. సోమిరెడ్డి మాత్రం తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. అలాగే మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరుతుండగా, అదేస్థానం నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండడంతో గంటా వెనుకాడుతున్నారు. తనకు భీమిలి సురక్షితస్థానంగా గంటా భావిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి సీటును సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ను ఆశిస్తున్నారు. వీటిపై కూడా చంద్రబాబు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇక జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఇప్పటివరకు ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీంతో చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడి బుజ్జగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వెంటనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన, బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు కొందరు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీటును ఆశించి భంగపడ్డ ప్రతి నేతతో నేరుగా మాట్లాడి సముదాయిస్తూ, టీడీపీ ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.