మద్యం పాలసీ కేసులో సుప్రీంకు తెలిపిన కేజ్రీవాల్
న్యూదిల్లీ: మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ‘అత్యంత ఎత్తుగడ’తో వ్యవహరించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై దాఖలు చేసిన ఈడీ ప్రత్యుత్తర అఫిడవిట్కు ప్రతిస్పందనగా దర్యాప్తునకు తాను ఎప్పుడూ సహకరిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు. తొమ్మిదిసార్లు సమన్లు పంపినప్పటికీ దర్యాప్తు అధికారి (ఐఓ) ముందు హాజరు కాకపోవడం తన అరెస్టుకు కారణమని ఈడీ తెలిపిందని, అటువంటి సందర్భంలో కస్టోడియల్ ఇంటరాగేషన్ నిందితులను ‘మరింత సమర్ధవంతంగా’ ప్రశ్నించడానికి దారితీస్తుందని తన సమాధానంలో చెప్పిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన తన సమాధాన అఫిడవిట్లో వివరించారు. ‘పైన పేర్కొన్న కాలవ్యవధి, ప్రత్యుత్తరంలోని విషయాలు చట్టబద్ధమైన ప్రక్రియకు అవమానకరమైన రీతిలో ఈడీ అత్యంత ఎత్తుగడతో వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపారు. తన ప్రత్యుత్తరంలో ఈడీ వైఖరి, దాని విచారణా ప్రవర్తన కఠోరమైన అసత్యాన్ని’ బహిర్గతం చేస్తోందని పేర్కొన్నారు. కీలకమైన వివరాలు, సమాచారాన్ని కోరుతూ తనకు జారీ చేసిన ప్రతి సమన్లకు తగిన విధంగా స్పందించినట్లు రికార్డు వెల్లడిస్తుందన్నారు. ‘అధీకృత ఏజెంట్ ద్వారా పిటిషనర్ను (కేజ్రీవాల్) పిలవకపోవడం లేదా అతని నుంచి రాతపూర్వకంగా లేదా వర్చువల్ పద్ధతిలో సమాచారం లేదా పత్రాలు కోరడంలో ఆవశ్యకత ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. జైలు నుంచి విడుదల కావడానికి తాను అర్హుడనని కేజ్రీవాల్ తెలిపారు. ఈడీ తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడంతో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 15న అత్యున్నత న్యాయస్థానం కేజ్రీవాల్ అభ్యర్థనపై ప్రతిస్పందన కోరుతూ ఈడీకి నోటీసు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు ఏప్రిల్ 9న సమర్థించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో తర్వాత ఆ పాలసీని రద్దు చేశారు.