. 6వ తేదీలోగా పూర్తి చేయాలి
. రోగులు, దివ్యాంగులు, వితంతువుల ఇంటి వద్దకే…
. సెర్ప్ ఆదేశాలు సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఈ నెల ఆరు వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథó్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే సచివాలయ ఉద్యోగులు పరిమితంగా ఉన్నందున కొందరికి ఇంటివద్దే ఇవ్వడంతోపాటు, మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు ఇంటివద్దే పింఛన్ ఇవ్వాలని సూచించింది. గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో రెండు కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకూ సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ మేరకు పని వేళలను నిర్దేశించింది. మూడు రోజుల పాటు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని సూచించింది. సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలు, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు, పంపిణీకి అవసరమైన ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.