. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల వెల్లడి
. ఎంపీ మిథున్రెడ్డికి ‘పిఠాపురం’ బాధ్యతలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:
వైసీపీ తుది జాబితాను ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత, సీఎం జగన్ శనివారం విడుదల చేయనున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఏకకాలంలో జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే 12 జాబితాల ఆధారంగా 70 అసెంబ్లీ, 20 పార్లమెంట్ స్థానాల్లో ఇన్ఛార్జిలను మార్పులు, చేర్పులు చేశారు. మిగిలిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి, ఏక జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో ఆశావాహుల్లో కొంత అలజడి నెలకొంది. ఇటీవల వైసీపీలోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగాయి. టీడీపీ, జనసేన నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. వారి చేరికల సమయానికే వైసీపీ జాబితా దాదాపు కొలిక్కివచ్చింది. వైసీపీ ముఖ్యనేతలను, ప్రాంతీయ ఇన్ఛార్జిలను అనేక మంది సంప్రదించి, వారి టికెట్ల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. అక్కడక్కడా ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపడంపైనా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా బరిలోకి ఆధిష్ఠానం దించనుంది. రాజోలు ఇన్చార్జిగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును నియమించింది. ఇది మినహా తుది జాబితాలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఇప్పటికే ప్రకటించిన 70 అసెంబ్లీ
ఇన్చార్జిలు మినహా, మిగిలిన అన్ని స్థానాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల పేర్లను కొద్దిపాటి మార్పులతో ప్రకటించనున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును తాజాగా వైసీపీలో చేరిన జనసేన నేత ఈలి నానికి కేటాయిస్తారన్న ప్రచారముంది. వైసీపీలో చేరిన కాపు సంఘ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన తనయుడు ముద్రగడ గిరికి సీట్లు దాదాపు కేటాయించే అవకాశం లేదని తెలిసింది. ఇప్పటికే తాము బేషరతుగా పార్టీలో చేరుతున్నట్లు మీడియాకు ముద్రగడ వెల్లడిరచిన విషయం విదితమే.
పిఠాపురం నుంచి జనసేన నేత పవన్ కల్యాణ్ పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ముంస్తుగానే వైసీపీ ఆధిష్ఠానం గుర్తించి, పిఠాపురం ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ వంగా గీతను నియమించారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను ప్రాంతీయ ఇన్ఛార్జి, ఎంపీ మిధున్రెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. ఈ తుది జాబితా విడుదల అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఈనెల 18 నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల్లో రోజుకు మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా సీఎం ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రచారం ప్రారంభమైన కొద్ది రోజులకే మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సమన్వయం లోపించింది. ప్రధాన కూటమి పార్టీ అయిన టీడీపీ రెండు విడతలుగా జాబితాలను విడుదల చేసింది. జనసేన ఆరు సీట్లనే ప్రకటించింది. బీజేపీ ఇంతవరకు బోణీ చేయలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ప్రకటించిన సీట్లపై చాలా చోట్ల ఆందోళనలు, నిరసనలు నెలకొన్నాయి. ్ల టికెట్లు రాని వారంతా తీవ్ర అసంతృప్తికి గురై, ఆధిష్ఠానంపై తిరుగబడుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కంటే, వైసీపీ అన్ని విధాలా సిద్ధమైంది. ఏకకాలంలో అభ్యర్థుల జాబితా విడుదలతోపాటు ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు.