. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే
. కేంద్రానికి కిసాన్ మహాపంచాయత్ డిమాండ్
. 50 వేల మంది రైతులతో కిక్కిరిసిన రామ్లీలా
. మోదీని గద్దె దించి… రైతులను కాపాడుకుందాం: రావుల వెంకయ్య, తికైత్
న్యూదిల్లీ : ఇచ్చిన హామీలన్నీ నెరవేరేంత వరకు తమ పోరు ఆగబోదని రైతులు గురువారం కేంద్రానికి తేల్చిచెప్పారు. నిరంకుశత్వాన్ని విడనాడాలని, రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు వద్దని హితవు పలికారు. దిల్లీ నడిబొడ్డున రామ్లీలా మైదానంలో కిసాన్ మహాపంచాయత్ విజయవంతమైంది. ఆంక్షలు, షరతులు, నిర్బంధా లను లెక్క చేయకుండా 50 వేల మంది అన్నదాతలు దిల్లీకి చేరుకొని తమ సంకల్ప బలాన్ని మరోసారి రుజువు చేశారు. పంటలకు కనీస మద్దత ధర, అందుకు చట్టబద్ధత, రైతులకు రుణమాఫీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు తదితర డిమాండ్లు అమలు చేయాల్సిందేనని నినదించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం నెల రోజులుగా సరిహద్దుల వద్ద ఆందోళన చేసిన రైతులు…దేశ రాజధానిలోకి ప్రవేశించారు. రామ్లీలా మైదానంలో మహాపం చాయత్ను విజయవంతం చేశారు. అన్ని డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు పోరు ఆగబోదని కేంద్రానికి తేల్చిచెప్పారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంగణాన్ని దద్దరిల్లించారు. కాగా, కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ తీర్మానించింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశ నలుమూలల నుంచి 50 వేల మందికిపైగా రైతులు కదలి రాగా రామ్లీలా మైదానం కిటకిటలాడిరది. మహా పంచాయత్కు 21 మంది అధ్యక్షవర్గంగా ఉండగా వీరిలో ఏఐకేఎస్ నేత బలదేవ్సింగ్ నెహల్గార్, అసన్మొల్ల, అవీక్ష, అషీష్ మిట్టల్ తదితరులు ఉన్నారు. ప్రధాన వక్తల్లో ఏఐకేఎస్ అధ్యక్షుడు రావుల వెంకయ్య, బీజూ కృష్ణన్, రాకేశ్ తికైత్ (బీకేయూ), దర్శన్ పాల్సింగ్, సత్యవన్ ఉన్నారు. కార్మిక, వ్యవసాయ, మహిళా, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి.
రావుల వెంకయ్య మాట్లాడుతూ మహా పంచాయత్ విజయవంతం కావడం రైతుల సంకల్పబలానికి తార్కాణమని ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కలిగించినా, నిర్బంధకాండకు తెరతీసినా… రైతులు వెనకడుగు వేయలేద న్నారు. నిర్బంధాలు, ఆంక్షలను లెక్క చేయ కుండా పెద్దసంఖ్యలో దిల్లీ చేరుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఇంతకు ముందు నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు పోరాడి ప్రధాని మోదీ దిగివచ్చేలా చేశారని, ఆయన రైతాంగానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని రావుల వెంకయ్య గుర్తుచేశారు. నాడు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరకపోవడంతో రైతులు మరో ఉద్యమానికి నడుం బిగించారని చెప్పారు. రెండేళ్లు దాటినాగానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లభించలేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని రావుల వెంకయ్య విమర్శించారు. ఫిబ్రవరి 16న భారత్ బంద్ విజయవంతమైందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించి దేశాన్ని, రైతులను కాపాడుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. ఎస్కేఎం నేత దర్శన్ పాల్ మాట్లాడుతూ మహాపంచాయత్ రైతాంగ శక్తికి నిదర్శనమని, లక్ష్యసాధనకు ఎంతో దూరంలో లేమని ప్రభుత్వానికి ఈ సభతో తెలియజేస్తున్నామని అన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులంతా ఐక్యంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికైత్ నొక్కిచెప్పారు. రైతుల ఐక్యతా సందేశం ఇప్పటికే కేంద్రానికి అందిందన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం, తప్పుడు విధానాలలే రైతుల కష్టాలకు కారణమని దుయ్యబట్టారు. ఈ ఉద్యమం ఆగబోదని తికైత్ ఉద్ఘాటించారు. ఎంఎస్సీకి చట్టబద్ధత పెద్ద సమస్యగా ఉన్నదన్న ఆయన మహాపంచాయత్ నిర్ణయాన్ని మీ గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలకు చేరవేయాలని సభికులనుద్దేశించి అన్నారు. దేశంలో పెద్దఎత్తున ఆందోళన జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దిల్లీ ఉద్యమం సమయంలో కేంద్రం కొన్ని హామీలు ఇచ్చిందిగానీ అందులో ఒక్కటీ అమలు కాలేదని, అన్ని పంటలకు సముచిత ధరలు రైతులకు కల్పించాలని డిమాండ్ చేశారు. దిల్లీకి రాకుండా రైతులను ఎక్కడికక్కడే నిర్బంధించారని, ముఖ్యంగా యూపీలో ఇలాంటి పరిస్థితులు ఉండటం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని అధికారులకు తికైత్ సూచించారు. బీకేయూ (ఏక్తా ఉగ్రాహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ కోక్రికలన్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానానికి వ్యతిరేకంగా మహాపంచాయత్ వేదికగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. కిసాన్ మహాపంచాయత్ దృష్ట్యా దిల్లీలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దులతో పాటు నగరంలోనూ పెద్దఎత్తున పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించారు. రామ్లీలా మైదానంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. దిల్లీ గేట్, మీర్ దర్డ్ చౌక్, అజ్మీరీ గేట్ చౌక్, గురు నానక్ చౌక్, ఆర్ కమ్లా మార్కెట్, పహార్గంజ్ చౌక్, ఆర్/ఏ రaందేవాలన్ మహారాజ రంజిత్ సింగ్ ఫైఓవర్ నుంచి బరాఖంబా రోడ్డు నుంచి గురు నాయక్ చౌక్, బారా ఖంబా రోడ్డు, టోల్స్టోయ్ రోడ్డు, జన్పత్ మార్గ్, ఆర్/ఏ జీపీఓ మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగినట్లు పోలీసులు చెప్పారు.