. పుంగనూరు వంటి ఘటనలు సరికాదు
. వరద బాధితులను ఆదుకోవాలి
. సీఎం చంద్రబాబుకు రామకృష్ణ సూచన
విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు : రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వరదలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశానికి వచ్చిన సందర్భంగా రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిపై దాడి సరికాదని రామకృష్ణ చెప్పారు. గతంలో వైసీపీ చేసిన తప్పులు ఇప్పుడు టీడీపీ కొనసాగిస్తోందని, అలాంటప్పుడు వైసీపీకీ, టీడీపీకీ తేడా ఏమిటని ఆయన ప్రశ్నించారు. పుంగనూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి స్పందించాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలు పక్కనపెట్టి…రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. వరదలకు దెబ్బతిన్న రైతులకు రైతు భరోసా కింద 20 వేల రూపాయలు అందచేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ ప్రతినిధి బృందాలు పర్యటించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాయని రామకృష్ణ తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు బాగాలేవని, ఇప్పటికే రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం సాధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక ప్రయోజనాల కోసం పదేపదే దిల్లీ వెళ్లడం కాకుడా…ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ప్లాంట్, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని కోరారు. గడచిన పదేళ్లలో ఎన్డీయే, వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నిలబడటానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలకంగా మారిన నేపథ్యంలో విభజన హామీలు సాధించాల్సిన బాధ్యత కూడా ఆ రెండు పార్టీలపై ఉందన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోకుండా మీడియా సంస్థలను, విలేకరులను దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 25 నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సీపీఐ అధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సంస్కరణ చట్టాలు, బ్యాంకుల జాతీయీకరణ, పెత్తందారులకు వ్యతిరేకంగా సీపీఐ చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతోపాటు పార్టీ బలోపేతానికి వాడవాడలా పార్టీ శత దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. వెంకట్రావు, నగన కార్యదర్శి పీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.