. దిల్లీ ఉద్యమ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు
. నినదించిన అన్నదాతలు
. రాజమండ్రిలో ఉత్సాహంగా రైతుసంఘం మహాసభ ప్రారంభం
విశాలాంధ్ర బ్యూరో-రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర 18వ మహాసభలు రాజమండ్రిలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రైతు మహాప్రదర్శన మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమై శ్యామల సెంటర్, డీలక్స్ సెంటర్, విజయ థియేటర్ రోడ్డు, గోదావరి గట్టు మీదుగా రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు సాగింది. ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది రైతులు కదం తొక్కారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయంపై గళం విప్పారు. రైతుల ఐక్యతపై హేళన చేస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించారు. దిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధపడతామని ప్రతినపూనారు. రైతుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రైతులకు అండగా నిలబడే పార్టీలకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరకల్పించాలని, ఎరువులు, మందులు ఉచితంగా ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, 60 సంవత్సరాలు పైబడిన రైతులకు పింఛను ఇవ్వాలని ర్యాలీలో రైతులు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు దద్దరిల్లాయి. బాణసంచా పేలుళ్లు, డప్పుల దరువుతో ప్రదర్శన మార్మోగింది. 18 జెండాలతో చేసిన కవాతు ప్రజలను ఆకట్టుకుంది. ప్రదర్శనలో పాల్గొన్న మహిళా రైతులు ఆకర్షణగా గెలిచారు. మహా ప్రదర్శన అగ్రభాగాన ఏఐకేఎస్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నడవగా… వారిని అనుసరిస్తూ వందలాది మంది రైతులు పాల్గొన్నారు.