పట్టించుకోని పాలకులు
. గుంటూరు ఛానల్ పొడిగింపుతో 50 గ్రామాలకు తాగు, సాగునీరు
. గుంటూరు, పల్నాడు, ప్రకాశం రైతులకు లబ్ధి
విశాలాంధ్ర – చిలకలూరిపేట : గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, పొడిగింపు, విస్తరణ పనుల కోసం గుంటూరు కలెక్టరేట్ వద్ద రైతులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 18వ రోజుకు చేరుకుంది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు నాయకులు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న రైతుల పోరాటం ప్రస్తుతం ఉధృత రూపం దాల్చింది. నీళ్లు వస్తే బీళ్లువారిన నేలల్లో పంటలు పండుతాయని, తమ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని, 50 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుందని రైతులు ఆశించారు. కానీ అది కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలెన్ని మారినా రైతుల కష్టాలు తీరడం లేదు. గుంటూరు ఛానల్ పొడిగింపుపై హామీలు తప్ప అమలుకు నోచుకోవడం లేదు. తాము అధికారంలోకి వస్తే గుంటూరు ఛానల్ను పొడిగిస్తామని 2018లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్తిపాడు నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. గుంటూరు ఛానల్ను యామర్రు నుంచి పర్చూరు వరకు పొడిగించడం ద్వారా చిలకలూరిపేట, పెదనందిపాడు, కాకుమాను, యడ్లపాడు, పర్చూరు, ప్రత్తిపాడు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాలకు తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి గుంటూరు ఛానల్ను పెదనందిపాడు వరకు పొడిగించాలన్న డిమాండ్ ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. 1953 నుంచి 1967 మధ్య పార్లమెంట్లో తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, శాసనసభలో వావిలాల గోపాలకృష్ణయ్య తదితరులు పెదనందిపాడు ఛానల్ను నిర్మించాలని కోరారు. 1961లో అసెంబ్లీలో చర్చ సాగింది. కాలువను దగ్గుపాడు వరకు పొడిగించడానికి నిర్ణయిస్తూ గుంటూరు ఛానల్గా పేరు మార్పుచేశారు. తర్వాత తాడేపల్లి మండలం పోలకంపాడు కృష్ణా కాలువ నుంచి యామర్రు వరకు మాత్రమే కాలువ నిర్మించారు. అప్పటి నుంచి కాలువ పొడిగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నల్లమడ రైతుసంఘం అధ్వర్యంలో అనేకమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఆరుతడులకు సైతం నీరు అందించలేని స్థితిలో రైతులు ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం పోరుబాట పట్టారు. గతంలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, యడ్లపాడు, కాకుమాను, ప్రకాశం జిల్లాలోని పర్చూరు తదితర ప్రాంతాలలో సుమారు 50 గ్రామాల రైతులు నల్లమడ రైతుసంఘం అధ్వర్యంలో రైతుయాత్ర చేశారు. 50 వేల ఎకరాలు, 50 గ్రామాలకు సాగు, తాగు నీళ్లు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టు గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం కొల్లా వెంకయ్య జీవితకాలం పోరాటం చేశారు. 2002లో చిలకలూరిపేటలో జాతీయ రహదారిని సైతం దిగ్బంధించారు.
హామీలు తప్ప అమలు లేదు
గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ ద్వారా నీళ్లు ఇచ్చారు. పెదనందిపాడుకు మాత్రం రాలేదు. 8 దశాబ్దాల క్రితం పెదనందిపాడు హైలెవల్ ఛానెల్ నిర్మాణానికి బ్రిటీష్ ప్రభుత్వం ముందుకొచ్చినా ఆచరణలో సాధ్యం కాలేదు. స్వాతంత్య్రం తర్వాత పాలకులు దీనిపై దృష్టిపెట్టి ప్రణాళికలు రచించారు. పెదనందిపాడు ఛానల్ నిర్మించి కృష్ణా నుంచి 75 వేల ఎకరాలకు నీరందించాలని, పెదనందిపాడు వరకు 40 మైళ్ల దూరం కాలువ ద్వారా నీరందించాలని నిర్ణయించినా ప్రాజెక్టు రూపుదాల్చలేదు.
2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రత్తిపాడు సభలో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ను పొడిగించి పెదనందిపాడు, పర్చూరు, ప్రత్తిపాడు ప్రాంతాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2014లో చంద్రబాబు. 2018లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా గుంటూరు ఛానల్ను పొడిగిస్తామని హామీ ఇచ్చారు. అయినా అమలుకాలేదు. 2017లో పెదనందిపాడు, పర్చూరు, కాకుమాను, ప్రత్తిపాడు మండల కార్యాలయాల వద్ద రైతులు ధర్నాలు చేశారు. ఆ తర్వాత రైతులు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. బహుళ ప్రయోజనాలు సిద్ధించే ప్రాజెక్టు పూర్తికి పాలకులు సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆందోళన తీవ్రతరం చేస్తాం
అతి సమీపంలో ఉన్న గుంటూరు ఛానల్ను పొడిగిస్తే సుమారు 50 వేల ఎకరాల భూమి సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. మంచి నేలలు ఉన్నప్పటికీ నీటి సమస్యతో గుంటూరు ఛానల్ పొడిగించాలని సుదీర్ఘకాలంగా కోరుతున్నాం. ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతోంది.
డాక్టర్ కొల్లా రాజమోహన్రావు,
నల్లమడ రైతుసంఘం కన్వీనర్