కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది.
ఈ కౌంట్డౌన్ దాదాపు 25:30 గంటల పాటు సాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్ సిరీస్లో ఇది మూడో ప్రయోగం కాగా ఎల్వీఎం3-ఎం4 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్తో అనుసంధానించారు. సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.