. విలీన మండలాల ప్రజల్లో ఆందోళన బ గ్రామాలను వీడని వరద
. నిలకడగా గోదావరి నీటిమట్టం
. కొనసాగుతున్న ఒకటవ ప్రమాద హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో-పాడేరు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకాస్త తగ్గితే ప్రమాద హెచ్చరికను తొలగిస్తామని కలెక్టర్ చెబుతున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల ప్రజలకు మాత్రం మళ్లీ వరద భయం పట్టుకుంది. ఇప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటే ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యా హ్నానికి గోదావరి 43.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 42 అడుగులకు తగ్గితేనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోనున్నారు. అయితే వర్షాలు కొనసాగు తున్న నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేవీపట్నం, చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నంలోని పోచమ్మ గండి వద్ద అమ్మవారి ఆలయం ఇంకా పూర్తిగా వరద నీటిలోనే మునిగి ఉంది. ఇక్కడి ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్పటికీ తాళ్లూరు గ్రామానికి చెందిన ఓ 50 కుటుంబాలు పునరావాసం సరిగా లేదని గ్రామంలోనే ఉండిపోయారు. దీంతో ఆ కుటుంబాల కి చెందిన ప్రజలను అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటపాక, కూనవరం మండలాలకు చెందిన అనేక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వీఆర్ పురం, చింతూరు. మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో వైపు శబరి నది వరద ఉధృతి తక్కువ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి చింతూరు మీదుగా ఒడిశాకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతుండడం, రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో జిల్లాలోని విలీన మండలాల గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు.
తుంగభద్రకు పోటెత్తిన వరద
విశాలాంధ్ర`బొమ్మనహళ్: తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాం తాల్లో గత నాలుగు రోజుల నుండి వర్షాలు కురుస్తుండటంతో తుంగ భద్ర జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయంలోకి సుమారు 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఎగువన కర్నాటకలోని శివమొగ్గ అగుంబే తీర్థహళ్లి తదితర ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయానికి 60వేల క్యూసెక్కుల పైగా వరద నీరు చేరింది. ఈనెల 20వ తేదీన తుంగభద్ర జలాశయానికి 9150 క్యూసెక్కులు రాగా 21న 13250క్యూసెక్కులు, 22న 41,572 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో జలాశయం మొత్తం నీటి నిల్వ 21.356 టీఎంసీలకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే ఆగస్టు మొదటి వారంలోపు జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని ఆయకట్ట రైతులు చర్చించుకుంటున్నారు. తుంగభద్రకు పెద్ద ఎత్తున వరద తరలిరావడంతో బోరు బావుల కింద వరి, మిరప నార్లు వేసుకున్న ఆయకట్టు రైతులు ఆనందపడుతున్నారు. సకాలంలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తారని ఆశాభావంతో ఉన్నారు.