ప్రజల వద్దకే వైద్య సేవలంటూ 108, 104, ఫ్యామిలీ ఫిజీషియన్పై దృష్టిపెట్టిన వైసీపీ ప్రభుత్వం, ప్రమాదవశాత్తు ప్రయాణికులు గాయపడితే తక్షణ వైద్యసేవలు అందించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన ఫస్ట్ఎయిడ్ కిట్లను సిక్ యూనిట్లో పడేయడం విచారకరం. కాలానుగుణంగా నిరర్ధక పాలనా వైరస్ సోకి మంచానపడ్డ ఫస్ట్ ఎయిడ్కు చికిత్స చేసి ప్రజా రవాణాకు అందుబాటులో తేవాలన్న ఆలోచన పాలకులు, అధికారుల్లో లేకపోవడం ప్రయాణికుల భద్రతపై వారికున్న ఆసక్తిని తెలుపుతోంది. తమది ప్రజారంజక పాలన అంటూనే చార్జీలు పెంచుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులపై మోయలేని భారం వేస్తున్న ప్రభుత్వానికి, బస్ ప్రమాదానికి గురైతే క్షతగాత్రులకు ఉపశమన చర్యలు చేపట్టాలన్న స్పృహలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయ సముపార్జనపైనే దృష్టి తప్ప ప్రయాణికుల సురక్షితంపై లేకపోవడం విచారకరం. సుమారు రూ.200 కూడా ఖర్చుగాని ఫస్ట్ ఎయిడ్ కిట్లను బస్సుల్లో అందుబాటులో ఉంచకపోవడంలో ఆంతర్యమేమిటోనని ప్రయాణికులు నిలదీస్తున్నారు.