చంద్రయాన్-3 విజయంతో జోరుగా కొత్త మిషన్ పనులు
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన చంద్రయాన్`3 ప్రయోగం విజయంతో దేశ తొలి మానవ సహిత గగన్యాన్ మిషన్ పనులు జోరందుకున్నాయి. ఆగస్టు చివరిలో గగన్యాన్ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇందుకోసం బెంగళూరు కేంద్ర కార్యాలయంలో చకచకా పనులు జరుగుతున్నాయి. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా 400కిమీల భూకక్షలోకి ప్రవేశపెట్టడం, మూడు రోజులు అంతరిక్షంలోనే ఉండటం తర్వాత సురక్షితంగా తిరిగి రావడం కోసం కసరత్తు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తల ప్రకారం చంద్రయాన్ 3ని ప్రయోగించిన లాంచ్వెహికలే ‘మానవసహిత’ ర్యాకెట్ ప్రయోగానికి సరైందని తెలిసింది. గగన్యాన్ కోసం ఎల్వీఎం
3 రాకెట్ను మానవులకు అనుకూలంగా మార్చారు. దీనిని హ్యూమన్ రేటెడ్ ఎల్వీఎం3గా ఇస్రో వ్యవహరిస్తోంది. భూ కక్షలో ఆర్బిటల్ మాడ్యూల్ను ఇది ప్రవేశపెట్టగలదని పేర్కొంది. ఆగస్టు చివరిలో గగన్యాన్ తొలి అబార్ట్ మిషన్ జరగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఇంతకుముందే ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది ఆఖరిలో మానవరహిత మిషన్ ప్రయోగానికి ప్రణాళికలను కూడా ఇస్రో సిద్ధం చేస్తోంది.