పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి.. ఇక్కడ జనసేనాని గెలుపుపై అందరిలో చర్చ జరుగుతోంది. పవన్ను ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్సీపీ.. సమస్య లేదు గెలిపించి తీరుతామని జనసైనికులు, అభిమానులు పోటీ పడుతున్నారు. దీంతో పిఠాపురంలో ఎన్నికలు హోరా హోరీగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించింది.. ఒక మండలానికి ఇటీవల పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభంను ఇంఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్ను ఓడించడమే తన లక్ష్యమంటూ పద్మనాభం కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను ఓడించకపోతే తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం చేసిన ఛాలెంజ్పై.. ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించటానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం బదులు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు అన్నారు.వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు.. కానీ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు. మా నాన్నను పవన్ కళ్యాణ్ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్న పద్మనాభం ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్న తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నావంతుగా కృషి చేస్తా అంటూ వీడియోలో ప్రస్తావించారు. క్రాంతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.