తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన తమిళిసై.. ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు గానూ.. రాజ్యంగబద్ధమైన గవర్నర్ పోస్టుకు ఆమె రాజీనామా చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి బరిలో దిగేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వచ్చాయి. చెన్నై సెంట్రలో లేదా తూత్తుకుడి నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తూత్తుకూడి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి చవిచూశారు. 2006 నుంచి తమిళిసై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఇంత వరకూ ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావటంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి మరోసారి ఓడిపోయారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేయగా.. మరోసారి కూడా ఓటమి ఎదురయ్యింది. అనంతరం 2019లోనే తెలంగాణా గవర్నర్గా నియమితులయ్యారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గానూ కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ గవర్నర్ నియామకం అయిన తొలినాళ్లలో కేసీఆర్ ప్రభుత్వంతో సఖ్యతతోనే ఉన్న తమిళిసై ఆ తర్వాత తన నిర్ణయాలతో ప్రభుత్వానికి దూరమైంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటం లేదని బహిరంగంగానే విమర్శించింది. ప్రభుత్వం పంపిన వివిధ బిల్లులను తిప్పి పంపటంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి అభ్యంతరం చెప్పారు. అలా గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. రేవంత్ ప్రభుత్వంతో ఆమె సఖ్యతగానే మెలిగారు. అయితే గత కొంత కాలంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. ఈమేరకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అదిష్ఠానంతో మట్లాడారు కూడా. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. చెన్నె సెంట్రల్ లేదా తుత్తూకూడి నుంచి ఆమెను అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలిసింది.