. రాజధాని ఉద్యమానికి 1300 రోజులు
. నేడు ‘4ఏళ్ల నరకంలో వనగరం’ పేరుతో సభ
. హాజరుకానున్న అన్ని రాజకీయపక్షాల నేతలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా అమరావతి రాజధాని ఉద్యమం నిరంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించి, లాఠీలు రaుళిపించి ఉక్కుపాదంతో అణచాలని ప్రయత్నించినా… చివరకు యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ సైతం అమరావతి ఉద్యమాన్ని కట్టడి చేయలేకపోయింది. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానిని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి, అధికార పీఠం ఎక్కగానే ఇంత దారుణంగా అడ్డం తిరుగుతారని ఊహించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ హామీతో రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులు రాజకీయ కుట్రకు బలయ్యారు. తమకున్న ఎకరం, అర ఎకరం పొలాన్ని ప్రభుత్వానికిచ్చి, ఏం చేయాలో దిక్కుతోచక నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమంటూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం… అమరావతి విధ్వంసానికి చేయని ప్రయత్నం లేదు. అమరావతి ఒక సామాజికవర్గానికి చెందినదని, ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు భారీ వ్యయమవుతుందని, ఇదొక శ్మశాన వాటిక అని, లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, ఇంత పెద్దమొత్తంలో ఖర్చు పెడితే హైదరాబాద్ తరహాలో అభివృద్ధి కేంద్రీకృతమవుతుందని….ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. కేవలం రాజకీయ కక్షతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నియంతృత్వ చర్యలకు అభంశుభం తెలియని రైతులు బలి పశువులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పొలం వెనక్కి తీసుకునే పరిస్థితి లేక, రైతుల వాటా కింద ఇచ్చిన ప్లాట్లను అమ్ముకోలేక, ప్రశ్నార్థకంగా మారిన పిల్లల భవిష్యత్ను తలచుకుంటూ రైతులు నాలుగేళ్లుగా ఏడవని రోజు లేదు. రాజధాని లేని రాష్ట్రంగా నిల్చిపోకూడదని, అమరావతి అద్భుత నగరంగా వెలుగొందాలన్న ఆశతో కన్నతల్లితో సమానమైన భూములను త్యాగం చేసిన రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోంది.
‘మేము రాజధాని ఇక్కడ పెట్టాలని కోరలేదు. కొత్తగా గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. గత ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీరు కూడా ఆనాడు అమరావతికి మద్దతిస్తేనే మేం భూములివ్వడానికి ముందుకొచ్చాం. దయచేసి మాకు న్యాయం చేయండి’ అంటూ రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇదే నినాదంతో మూడేళ్లకు పైబడి రైతులు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈనెల 9వ తేదీ నాటికి అమరావతి రైతుల రాజధాని ఉద్యమం 1300 రోజులకు చేరుతుంది.
నేడు మందడంలో సభ
అమరావతి ఉద్యమం 1300 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి అధ్వర్యంలో మందడంలో ఆదివారం ‘నాలుగేళ్ల నరకంలో నవనగరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
దీనికి అన్ని రాజకీయపక్షాల నేతలను, దళిత, మైనార్టీ, మహిళా జేఏసీ నేతలను, ప్రజాసంఘాల నేతలను ఆహ్వానించారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, వారి కుటుంబసభ్యులతో పాటు అమరావతి ఉద్యమానికి తొలినుంచి సంఫీుభావం తెలియజేస్తున్న ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని అమరావతి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.