బోరు నుంచి గ్యాస్ లీక్
ఎగసిపడిన అగ్ని కీలలు
విశాలాంధ్ర – రాజోలు : కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్ ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 20 అడుగుల మేర మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్ కోసం గతంలో సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం ఆరేళ్ల కిందట అక్కడ బోరు వేయగా… రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుగా తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్ బయటికి వచ్చి మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. పైప్లైన్ అయితే గ్యాస్ను నిలిపివేసి మంటలను ఆపేవాళ్లమని, కానీ, భూమిలో నుంచి నిరంతరం గ్యాస్ వస్తుండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు వెల్లడిరచారు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఏడు గంటలపాటు అగ్నిమాపక సిబ్బందితో పాట ఓఎన్జీసీ సిబ్బంది శ్రమించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎగసిపడిన మంటలు మధ్యాహ్నం 1.45 గంటలకు అదుపులోకి వచ్చాయి.
రాజోలు ఫైర్ సిబ్బంది, ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది కలిసి బోరు బావిని ఇసుక, నీటితో పూడ్చి వేశారు. ఇక ప్రమాదం లేదని తహసీల్దార్ ముక్తేశ్వరం, సీఐ శేఖర్బాబు తెలిపారు.