Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అవి డ్రోన్లు కాదు… మాకు ఆటబొమ్మలే

ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ వ్యంగ్యాస్త్రాలు
తెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా… టెల్‌ అవీవ్‌, తెహ్రాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించినవి తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయిల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాలోని న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న హుస్సేన్‌… అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగింది దాడే కాదు. అవి డ్రోన్లు కాదు… మా పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లాంటివి. మా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ఎలాంటి సాహసం చేయలేదు. అందువల్ల ఇప్పుడు తాము ప్రతిచర్యకు దిగట్లేదు. కానీ ఒకవేళ ఆ దేశం తమకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం… తమ ప్రతిస్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుంది. దానికి వాళ్లు పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని నెతన్యాహు సర్కారును హెచ్చరించారు. ఇదిలా ఉండగా… ఇరాక్‌లోని ఇరాన్‌ మద్దతున్న స్థావరాలపై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా… ఈ ఘటనలో కనీసం ముగ్గురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచారు. ఈ పేలుళ్లకు కారణమేమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. తాజా ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ నెల 13న మూడు వందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీస్థాయిలో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడినప్పటి నుంచి ఇజ్రాయిల్‌ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రతీకార దాడులు మొదలైనట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్‌ మాత్రం ఖండిరచింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. ఇజ్రాయిలే దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అటు టెల్‌ అవీవ్‌ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img