గాజాలో ఇజ్రాయిల్ నరమేధంపై
ప్రపంచ దేశాల ఆగ్రహం
టెల్అవివ్: గాజా నగరంలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న పౌరులపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేయడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిరచాయి. ఈ దాడిలో 104 మంది మరణించారు. సుమారు వెయ్యిమంది వరకు గాయాలపాలయ్యారు. తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయిల్ సైన్యం ఆ తరువాత ట్రక్కులవద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక్కసారిగా ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడంతో జరిగిన తొక్కిసలాటలోనూ కొందరు చనిపోయారు. ఇక గాజాపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్కు మద్దతుగా ఉన్న దేశాలు కూడా ఈ ఘోరకలిపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ… ఇలాంటి ఘటనలు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలను మరింత జఠిలం చేస్తాయన్నారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ దీనిపై పూర్తి సమాచారం పంపించాలని తాము ఇజ్రాయిల్ను కోరినట్లు వెల్లడిరచారు. ఈ ఘటనకు బాధ్యులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ‘ఆహారం కోసం వచ్చిన ప్రజలపై కాల్పులు జరపడాన్ని ఏమాత్రం సమర్థించుకోలేరు’ అని అన్నారు. పెద్ద ఎత్తున పలస్తీనా వాసులు ఆహార కొరత, అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయిల్ కట్టుబడి ఉండటంతోపాటు సాయం అందించే ట్రక్కులను గాజాలోకి వెళ్లనీయాలని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రాన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ… పౌరులను ఇజ్రాయిల్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇజ్రాయిల్ చర్య ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని ఐరోపా సమాఖ్య పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియే గుటెర్రస్ ఇజ్రాయిల్ చర్యను ఖండిరచారు. గాజా వాసులకు తక్షణమే సాయం అందించాలని తెలిపారు. అక్కడ దాదాపు వారం రోజుల నుంచి తమ సిబ్బంది పనిచేయలేకపోతున్నారన్నారు. టర్కీ ప్రభుత్వం స్పందిస్తూ.. మానవత్వంపై పాల్పడ్డ నేరంగా దీనిని అభివర్ణించింది. ‘ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొంది’ అని ఆ దేశ విదేశాంగశాఖ పేర్కొంది. ఇజ్రాయిల్తో ఉన్న ఆయుధ కొనుగోలు ఒప్పందాలను సస్పెండ్ చేస్తున్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. గాజాలో చర్యలను నరమేధంగా అభివర్ణించారు. ‘ఆహారం అడిగిన 100 మందిని మీరు చంపారు నెతన్యాహు’ అని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఖతార్, సౌదీ దేశాలు కూడా ఇజ్రాయిల్ తీరును తప్పుపట్టాయి.
సైన్యంపై దాడి…అందుకే కాల్పులు జరిపామన్న ఇజ్రాయిల్
ఈ ఘటనను ఇజ్రాయిల్ ధ్రువీకరించింది. అయితే సైనికులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఆహారం కోసం జరిగిన తోపులాట, తొక్కిసలాటతోపాటు జనంపై నుంచి ట్రక్కులు వెళ్లడంతో డజన్ల మంది మరణించారని పేర్కొంది. జనాన్ని చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపిందని, దీంతో చాలా మంది కార్ల కింద దాక్కున్నారని, తూటాల వర్షం నిలిచిపోయాక మళ్లీ ఆహార సంచుల కోసం ఎగబడ్డారని, దీంతో మరోసారి కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షలు వివరించారు. ఈ ఘటనను మారణ హోమంగా గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు గాజాలో ఇప్పటివరకూ 30,035 మంది మరణించారని, 70,457 మంది గాయపడ్డారని ప్రకటించింది.