సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య
విశాలాంధ్ర – ఆలూరు : ఆలూరు నియోజకవర్గ సస్యశ్యామలానికై వేదావతి ప్రాజెక్టు నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని మండల కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పాల్గొని మాట్లాడుతూ జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నిత్యం కరువు కాటకాలకు నిలియంగా మారిందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి సాగు, త్రాగు నీరుకై వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి, నియోజకవర్గ పరిధిలోనే అన్ని గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందించాలని, ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువలు, పైప్ లైన్ పనులు కింద భూములు కోల్పోయిన రైతాంగానికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ కు అదనంగా 5 రెట్లు కలిపి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా వేదావతి ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధి గురించి సమావేశంలో కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఆగస్టు 3వ తేదీన ధర్నా కార్యక్రమాలు, ఆగస్టు 9,10 వ తేదీలలో 48 గంటల నిరాహార దీక్షలు, ఆగస్టు 17,18,19 తేదీలలో కలిసొచ్చే అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 16వ తేదీన విశాఖ నగరంలో ప్రారంభమై సిపిఐ బస్సు యాత్ర ఆగస్టు 31వ తేదీన ఆలూరు పట్టణానికి చేరుకుంటుందని ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, విరుపాక్షి, జిల్లా సమితి సభ్యులు భూపేష్, దేవనకొండ, హోలగుంద మండలాల కార్యదర్శులు నరసారావు, మారెప్ప, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు శివ, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా కార్యదర్శి రంగన్న, రంగడు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు బ్రహ్మయ్య, అంజినయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రంగన్న, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.