విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఆర్డీవో కార్యాలయంలో గత పది రోజులుగా ఈవీఎం మిషన్ పై ఓటును వేసే విధానంపై అవగాహన సదస్సును ప్రతిరోజు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆర్డీవో సురేష్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారి సిబ్బందిచే ఆర్డిఓ కార్యాలయానికి వచ్చు ప్రతి ఒక్కరికి వీటిపైన అవగాహన కల్పించడం, తద్వారా ఎన్నికల రోజు ఓటును వేయడానికి సులభతరం అవుతుందని తెలిపారు. ఈవీఎం మిషన్లో బ్యాలెట్ యూనిట్,కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్ అనే మూడు విభాగాలు ఉంటాయని, ఈ మూడు విభాగాల యొక్క పనితనం గూర్చి కూడా వివరించడం జరుగుతోందని తెలిపారు. ఈ అవగాహన సదస్సు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు డిగ్రీ కాలేజీలలో నేరుగా ఆ కాలేజీకి వెళ్లి ఈవీఎం యంత్రంపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి, తద్వారా వారి కుటుంబంలోని వారందరికీ ఓటు వినియోగం చేసుకోనేలా చర్యలు కూడా చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లు, కరెస్పాండెంట్లు ఇటువంటి కార్యక్రమం పై తమ తమ విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి కతిజున్ కుప్రా, సి ఎస్ డి టి- ఈశ్వరయ్య, సిబ్బంది రాజకుమార్, రాజ్యలక్ష్మి ,లక్ష్మీదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.