విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: జులై 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగలనుంది. వైఎస్సార్ పింఛను కానుక కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి, జులై నుంచి మంజూరు చేసి పెన్షన్లు అందజేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది జనవరి తర్వాత పెన్షన్కు అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులు సుమారు లక్షన్నర మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా జులై 1వ తేదీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏటా జనవరి, జులై నెలల్లో రెండు విడతలుగా మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం 2023 జనవరి నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పెన్షన్లు అందజేసింది. దీంతో జులై నుంచి కూడా కొత్తవారికి వస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఇంకా ఆర్థికశాఖ ఆమోదం లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి గత నెల ఒకటవ తేదీ మంజూరు చేసిన జాబితా ప్రకారమే ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. జూన్ 1వ తేదీ లెక్కల ప్రకారం 63.14 లక్షల మందికి పెన్షన్లు ప్రభుత్వం ఇస్తోంది. వీరిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ సంఖ్యకు కొత్తగా మరో లక్షన్నర మంది లబ్ధిదారులు చేరనున్నారు. కొత్తవారికి ఆగస్టు 1వతేదీ నుంచి ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటుండగా, ఆరు నెలలుగా జులై కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు నిరాశచెందుతున్నారు. గత ఏడాది కూడా ఒక నెల ఆలస్యం చేసి, ఆగస్టు నెల నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు.