ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా
విశాలాంధ్ర – కూర్మన్నపాలెం : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, పరిశ్రమలను కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా విమర్శించారు. ఉక్కు నగరం లోని ఆంధ్ర కేసరి కళా క్షేత్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర స్థాయి యువ కార్యకర్తల రెండు రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ పాండా ప్రారంభించి మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని తెలిపారు. జాతీయ రహదా రులు, విశాఖ స్టీల్ ప్లాంట్, బీఎస్ఎన్ఎల్, పెట్రోలి యం, బ్యాంకులు, బీమా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు చౌకగా అమ్మేస్తోందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డబుల్ ఇంజన్గా వ్యవహరిస్తోందని, ల్యాండ్, ఇసుక, లిక్కర్, చిట్ఫండ్ మాఫియాకు పాల్పడుతోంద న్నారు. ఏఐటీయూసీ కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణా తరగతుల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశం పూర్తిగా దివాలా తీస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చరిత్రలో కానీ, స్వాతంత్య్ర పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించి పోరాటాలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్టీల్ ఏఐటీయూసీ అధ్యక్షులు కె.ఎస్.ఎన్.రావు, అదనపు ప్రధాన కార్యదర్శి జె.రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య, కోశాధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతుల సందర్భంగా తొలుత రామకృష్ణ పాండా ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు.