ఆగస్టు 14న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితునిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయకుమార్ రెడ్డిపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆమేరకు అవినాశ్రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ, ఆగస్టు 14న కోర్టు హాజరు కావాలని శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16వ తేదీన అరెస్ట్ చేశారు. 7వ నిందితునిగా ఉన్న ఉదయకుమార్ రెడ్డిని ఏప్రిల్ 14వ తేదీ అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. శుక్రవారం సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు.
వీరందరికీ ఆగస్టు 14వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ముందస్తు బెయిల్పై ఉన్న అవినాశ్రెడ్డిని ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది.