విపక్ష నేతల భేటీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం పట్ల, ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని ఈ సమావేశంలో విపక్ష నేతలతో కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశం ఉద్దేశం మన కోసం అధికారం సాధించుకోవడం కాదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే మనమంతా కలిశామని ఖర్గే చెప్పుకొచ్చారు. రాష్ట్ర స్ధాయిలో మన మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, విభేదాలున్నా అవి సిద్ధాంతపరమైనవి కాదని విపక్ష భేటీలో ఖర్గే పేర్కొన్నారు. సగటు వ్యక్తి, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ప్రయోజనాల కోసం చిన్నపాటి విభేదాలను మనం పక్కనపెట్టి పోరాడగలమని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు. ఇక విపక్షాల భేటీలో రెండో రోజు మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన అంశాలపై బ్లూప్రింట్ తయారుచేసేందుకు కమిటీ ఏర్పాటు కానుంది.
కనీస ఉమ్మడి కార్యక్రమం స్ధానంలో లేవనెత్తాల్సిన ఉమ్మడి అంశాలను గుర్తించి జాబితా రూపొందించేందుకు కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇక యూపీఏ పేరు మార్పు విషయంలోనూ విపక్షాల సమావేశంలో నేతలు కసరత్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న నేతలు నేడు నూతన కూటమి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం వాడరాదని టీఎంసీ సూచించింది.