3 గంటలే పరిమితం
. టమాటాల కోసం రైతు బజార్లలో మహిళల క్యూ
. ధరల నియంత్రణలో జగన్ సర్కారు వైఫల్యం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వినియోగదారుడిపై టమాటా ధర మోత మోగిపోతోంది. ఇటీవల కాలంలో భారీగా ధర పెరిగిన టమాటాను కొనుగోలు చేయడం సామాన్యులకు పెనుభారంగా మారింది. పెరిగిన టమాటా ధరకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సమయాలు అందరికీ తెలియక నష్టపోతున్నారు. రెండు లేదా మూడు గంటల పాటే సబ్సిడీ ధరతో టమాటాను విక్రయిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్న విమర్శలున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర నగరాల్లోని ప్రధాన రైతు బజార్లలో ప్రభుత్వం సబ్సిడీ ధరకు టమాటా విక్రయాలను మొక్కుబడిగా ప్రారంభించింది. విజయవాడలో మాత్రం ఉదయం
8 గంటల నుంచి 10 గంటల వరకే సబ్సిడీ ధర అమలులో ఉంటోంది. ఆ సమయంలో వచ్చిన వారికే కిలో చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా రూ.100 ఉంటే, దానికి సబ్సిడీ కింద రూ.50కే అందిస్తున్నారు. 10 గంటల తర్వాత వచ్చిన వారికి మళ్లీ కిలో రూ.100 లేదా అంత కంటే ఎక్కువుగా బయట మార్కెట్లో తరహాగా విక్రయిస్తున్నారు. ఇదే విధానం మిగిలిన నగరాల్లోనూ అమలవుతున్నట్లు తెలిసింది. టమాటా విక్రయాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరపున సబ్సిడీ అమలు చేస్తున్నామంటూ ప్రచారం చేయడం లేదు. దీనివల్ల సామాన్యులకు సమాచారం తెలియక ఆర్థికంగా నష్టపోతున్నారు. చాలా రోజులుగా టమాటా ధర మార్కెట్లో రూ.100 నుంచి రూ.150కు ఎగబాకింది. ప్రస్తుతం ఈ ధర రూ.100 నుంచి రూ.110గా ఉంది. ప్రజలకు నిత్యవసర వస్తువుగా టమాటా ఉంది. ప్రతి కూరలోనూ దీనిని వేస్తారు. దీంతో టమాటా లభించక, గృహిణులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు బజార్ల దగ్గర ఉదయం నుంచే పడిగాపులు పడుతున్నారు.
వినియోగదారుల అవస్థలు
సబ్సిడీ ఇచ్చే రైతు బజార్ల దగ్గర గంటల కొద్దీ వినియోగదారులు బారులుదీరి నిల్చొని ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కొంతకాలంగా టమాటా ధర విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా భరించే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు చాలా ప్రాంతాల్లో సబ్సిడీ ధరను ప్రభుత్వం తొలగించినట్లు తెలిసింది. సబ్సిడీ ధరకు విక్రయించే టమాటా స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతున్నారు. అదే మార్కెట్ ధరకు విక్రయించే టమాటా గుట్టలు గుట్టలుగా పేర్చి విక్రయానికి సిద్ధంగా ఉంచుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో తక్కువ ధరకు విక్రయించకుండా, బయట మార్కెట్ ధరకు విక్రయించడాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఖజానా నిండుగా ఉందంటూ ఆర్భాటంగా ప్రకటించారు. నిత్యావసర సరుకైన టమాటా ధరకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇచ్చి, ప్రభుత్వం ఎందుకు అందుబాటులోకి తేవడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.