విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ ఈఏపీసెట్ 2023 వెబ్ కౌన్సెలింగ్ (ఎంపీసీ స్ట్రీమ్) ప్రక్రియ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2023-24 విద్యాసంవత్సరానికిగాను బీఈ/బిటెక్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను కన్వీనర్ కోటా కింద ఈఏపీసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు…ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 18వ తేదీన ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మార్గదర్శకాలు విడుదలైన విషయం విదితమే. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగు తుంది. ప్రభుత్వ/ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు భర్తీ చేస్తారు. ఇందుకోసం ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వెబ్ కౌన్సెలింగ్ ఫీజు ఓసీ, బీసీలకు రూ.1200, ఎస్సీ, ఎస్టీలకు రూ.600 చెల్లించాలి. ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు ఆన్లైన్లో ధ్రువీకణ పత్రాలు పొందుపరచాలి. ఆగస్టు 3 నుంచి 8వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు, 9న మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. 12వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 13వ తేదీ నుంచి 14 వరకు సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 16వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభిస్తారు. ఎన్సీసీ, స్పోర్ట్సు అభ్యర్థులకు ఈనెల 30వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. బైపీసీ విభాగం వారి సీట్ల భర్తీకిగాను కన్వీనర్ ప్రత్యేకంగా షెడ్యూలు జారీ చేస్తారు.