. పార్లమెంటులో మోదీ ప్రకటన చేయాల్సిందే
. గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో ప్రతిపక్షాల డిమాండ్
. చర్చకు భయమెందుకని ఖడ్గే ప్రశ్న
న్యూదిల్లీ: మణిపూర్ ఘోరాలపై మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో ప్రకటన చేయాల్సిందేనని విపక్ష పార్టీలు తమ డిమాండ్ను పునరుద్ఘాటించాయి. మోదీ ప్రకటన చేయకపోతే వెనక్కి తగ్గేది లేదని, యావత్ దేశం సిగ్గుపడే ఘటనలు మణిపూర్లో చోటుచేసుకుంటున్నాయని, రోజుకో అకృత్యం, అరాచకం బయటికి వస్తున్నదని, అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విపక్షాలు విమర్శించాయి. మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు సోమవారం పార్లమెంటు కాంప్లెక్స్లో ఆందోళనకు దిగారు. ‘మణిపూర్ కోసం ఇండియా’, మణిపూర్పై ప్రధాని ప్రకటన చేయాలి’ అన్న ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖడ్గే విలేకరులతో మాట్లాడుతూ మణిపూర్ హింసపై పార్లమెంటులో సమగ్ర ప్రకటన చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీదని స్పష్టంచేశారు. ‘మణిపూర్లో వాస్తవ పరిస్థితులు ఏమిటో ప్రధాని వెల్లడిరచాలి. కానీ మోదీ సభ లోపలికి రావడం లేదు. ఆయన కార్యాలయంలోనే కూర్చుంటున్నారు. పార్లమెంటు లోపలకు రావడానికి భయపడుతున్నారు’ అని ఖడ్గే విమర్శించారు. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ తనతోనూ, టీఆం ్బాలు సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారని ఖడ్గే తెలిపారు. పార్లమెంటు లోపల ప్రధాని ప్రకటన చేయాలని, దానిపై చర్చకు అనుమతించాలని తాము నిక్కచ్చిగా స్పష్టంచేశామని తెలిపారు. సుదీర్ఘ చర్చకు అనుమతించే 267 నిబంధన కింద చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ కేవలం అర్ధగంట జరిగే స్వల్పకాల చర్చకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శించారు. 267 నిబంధన కింద చర్చ చేపడితే అవసరమైతే ఓటింగ్ కూడా నిర్వహించాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం భయపడుతోందని ఖడ్గే ఆరోపించారు. ‘స్పల్పకాలిక చర్చతో సమస్యకు పరిష్కారం లభించదు. మీరు 140 కోట్లమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు సభకు ఎందుకు రావడం లేదు? నిజాలు ఎందుకు చెప్పడం లేదు’ అని నిలదీశారు. సభ జరుగున్నప్పుడు ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ బయట ప్రకటన చేయరని, ఇది సంప్రదాయమని గుర్తుచేశారు. ఈ సంప్రదాయాన్ని మోదీ మొదటిసారి పాటించారని ఆరోపించారు. మోదీ సభకు వచ్చి…ప్రకటన చేయాలని తాము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మణిపూర్పై మోదీతో ప్రకటన చేయించాలని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాజ్యాంగ బాధ్యతల నుంచి మోదీ ప్రభుత్వం, బీజేపీ పారిపోకూడదని, మణిపూర్పై జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలని ఖడ్గే డిమాండ్ చేశారు.