. విపక్ష, అధికార సభ్యుల పరస్పర విమర్శలు
. స్తంభించిన పార్లమెంటు కార్యకలాపాలు
. ఇతర రాష్ట్రాలపై మౌనమెందుకని బీజేపీ ఎదురుదాడి
న్యూదిల్లీ: మణిపూర్ అంశంపై సోమవారం పార్లమెంటు స్తంభించింది. దీనిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాల్సిందేనన్న డిమాండ్కు ప్రతిపక్షాలు కట్టుబడి ఉంటడంతో ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. మోదీ పార్లమెంటు బయట మాట్లాడటమే కానీ లోపల ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించాయి. దీనికి అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం ద్వారా చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని ఆరోపించింది. పార్లమెంటు స్తంభించిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సహా కొంతమంది ప్రతిపక్ష నేతలతో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఫోన్లో మాట్లాడారు. పార్లమెంటులో ప్రతిష్ఠంభనకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్ హింసపై ప్రధాని ప్రకటన చేయాలన్న డిమాండ్తో విపక్ష సభ్యులు నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించడంతో సోమవారం కూడా పార్లమెంటు ఉభయసభలు నిరసనలు, వాయిదాలతో వాయిదా పడ్డాయి. చర్చకు సిద్ధమని, మణిపూర్పై హోంమంత్రి మాట్లాడతారని ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రధాని మాత్రమే ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ సమస్య తీవ్రతను ప్రభుత్వం తక్కువ చేస్తోందని ఖడ్గే ఆరోపించారు. ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దీనిపై తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టంచేశారు. మోదీ పార్లమెంటు బయట మాట్లాడుతున్నారని, దీనిద్వారా మోదీ పార్లమెంటును అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని వ్యాఖ్యానించారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మణిపూర్లో హింసను అదుపుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంపై మోడీ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికి 80 రోజులైనా హింస ఆగలేదని చెప్పారు. మోదీ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పార్లమెంటు బయట కేవలం 36 సెకండ్లు మాత్రమే మాట్లాడారని, పార్లమెంటు ద్వారా దేశానికి ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణాలు జరుగుతున్నా మణిపూర్ సీఎంను ఇంకా ఎందుకు తప్పించలేదని నిలదీశారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖమంత్రి ఎందుకు మణిపూర్లో పర్యటించలేదని ప్రశ్నించారు.
జేడీయూ నాయకుడు లాలన్ సింగ్ మాట్లాడుతూ మణిపూర్ ఘటనలు దేశానికి సిగ్గుచేటన్నారు. మణిపూర్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, అయినా అక్కడి పరిస్థితులను తక్కువగా చూస్తోందని ఆరోపించారు. సభలో మోదీ ప్రకటన చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ మాట్లాడుతూ మణిపూర్లో అత్యాచారాలకు నిరసనగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనలు చేయాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్లమెంటులో చర్చ జరగాలని తాము కోరుతున్నామని, దీనికి ప్రధాని చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ నాయకులు సుధాన్షు త్రివేదీ స్పందిస్తూ చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ఎదురుదాడి చేశారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసపై ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. రాజస్తాన్, పశ్చిమబెంగాల్లో మహిళలపై దాడులకు సంబంధించి ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని, తన సొంతమంత్రి చెప్పిందే రాజస్తాన్ ముఖ్యమంత్రి వినిపించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రతిపక్షాలను క్షమించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం రోజే ప్రధాని మోదీ మణిపూర్పై ప్రకటన చేశారని చెప్పుకొచ్చారు.