జగన్ ప్రభుత్వానికి రామకృష్ణ సూటిప్రశ్న
విశాలాంధ్ర – విజయవాడ (కృష్ణలంక) : ఏటా వరదలతో అష్టకష్టాలు అనుభవిస్తున్న పోలవరం విలీన మండలాల ప్రజల గోడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి పట్టదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏటపాక, చింతూరు, వర రామచంద్రాపురం, కూనవరం మండలాలు ఏపీలో విలీనమయ్యాయని, ఆయా మండలాల ప్రజలు ఏటా వరదబారిన పడి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ తెలిపారు. గతేడాది 70 అడుగుల మేర గోదావరికి వరద వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద పోటెత్తడంతో పోలవరం విలీన మండలాల ప్రజలు నానా అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. అనేక కాలనీలు నీటమునిగాయని, కూనవరంలో రోడ్లపై పడవలు తిరుగుతున్నాయంటే అక్కడ వరద పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందని ఆయన తెలిపారు. వరద ముంపు సందర్భాల్లో ఆయా మండలాల్లోని ప్రజలకు వేలాది రూపాయల వృధా ఖర్చు భారంగా మారుతుందని వెల్లడిరచారు. ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో దిక్కుతోచని స్థితిలో పోలవరం విలీన మండలాల ప్రజలు ఉన్నారన్నారు. బాధితుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆయా మండలాల వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సహాయక చర్యలు చేపడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దుర్మార్గపూరితంగా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ముంపు మండలాల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో విలీనమైన పోలవరం మండలాల ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత నుండి జగన్ ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటుందని. ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ముంపునకు గురైన పోలవరం విలీన మండలాల ప్రజలకు తక్షణమే పునరావాసం, సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని, విలీన మండలాల ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.