. మోదీ ప్రకటన చేయాల్సిందే
. ఖడ్గే, ఇతర విపక్ష నేతలతో గోయల్, జోషి చర్చలు విఫలం
న్యూదిల్లీ: మణిపూర్ మారణకాండపై రాజ్యసభ దద్దరిల్లుతోంది. విపక్షాలు మోదీ సర్కారు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మణిపూర్ పరిణామాలపై ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేయాలని, తర్వాత చర్చకు అనుమతించాలని పట్టుబడుతున్నాయి. దీంతో సభ సజావుగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, ఇతర ప్రతిపక్ష నేతలతో కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, ప్రహ్లాద్ జోషి మంతనాలు సాగించారు. అయినా విపక్షాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య అరగంటకు పైగా చర్చలు జరిగాయి. అయినా చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. పార్లమెంటు ఉభయసభల్లో మోదీ ప్రకటన చేయాల్సిందేనన్న డిమాండ్కు విపక్షాలు కట్టుబడి ఉన్నాయి. మోదీ ప్రకటన చేయాలని, తర్వాత 267 నిబంధన కింద చర్చకు అనుమతించాలని పట్టుబడుతున్నాయి. కానీ ప్రధాని ప్రకటన చేయాలన్న డిమాండ్ను అంగీకరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీనికిబదులు మణిపూర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేస్తారని చెబుతోంది. సభ సజావుగా నిర్వహించడానికిగాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతిపక్ష ఇండియా కూటమి హాజరుకాకపోవడంతో రాజ్యసభ నాయకుడు గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషి ఖడ్గే, ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రతిష్ఠంభనకు స్వస్తి పలకాలంటే కాలపరిమితి లేకుండా రాజ్యసభలో మణిపూర్పై చర్చకు అనుమతించాలని గోయల్, జోషికి ఇండియా కూటమి నాయకులు తేగేసి చెప్పారు. కాగా, ప్రతిపక్షంలో విభజన వచ్చిందని, ఏదో మార్గంలో చర్చ కావాలని కొంతమంది ఎంపీలు కోరుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని లేదా హోంమంత్రి ఎవరు సమాధానం చెప్పినా పర్వాలేదని అంటున్నారని వెల్లడిరచాయి. అదేసమయంలో ప్రధాని ప్రకటన చేయడం మినహా మరో చర్చకు తావులేదని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. మణిపూర్పై చర్చకు సంబంధించి నిబంధనతో పెద్దగా ఇబ్బంది లేదని, కానీ కాలపరిమితి లేకుండా పూర్తిస్థాయి చర్చ జరగాలని ప్రతిపక్ష నేత ఒకరు చెప్పారు. రాజ్యసభ ప్రతిష్ఠంభనకు తెరదించాలంటే మణిపూర్పై చర్చకు అనుమతించాలని, ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని సభా నాయకుడికి ఇండియా పార్టీలు మధ్యేమార్గంగా సలహా ఇచ్చినట్లు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సమావేశం అనంతరం చెప్పారు. 267 లేదా 176 నిబంధన ఏదైనా చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియా కూటమి ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించిందని, అక్కడ జరిగిన పరిణామాలు, హృదయవిదారక కథలు దేశానికి వివరించాలని ఎంపీలు కోరుకుంటున్నట్లు మరో ప్రతిపక్ష నేత చెప్పారు. ‘ఇక్కడ ఎవరూ అహంకారానికి పోవాల్సిన అవసరం లేదు. మణిపూర్పై ప్రధాని మాట్లాడాలి. మణిపూర్ కూడా దేశంలో భాగమే’నని స్పష్టంచేశారు.