. రాజద్రోహం స్థానే దేశద్రోహం
. మూకహత్యలకు మరణదండన
. మారనున్న ఐపీసీ, సీఆర్పీసీ, ఆధారాల చట్టాలు
. లోక్సభలో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్షా
న్యూదిల్లీ:నేరస్మృతులకు కొత్త తొడుగునకు మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. వలసవాద కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికే నెపంతో కొత్త సీసాలో పాత సారా చందంగా రూపం మార్చిన చట్టాలను లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజద్రోహం చట్టం ఇక దేశద్రోహంగా మారింది. బ్రిటష్ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెబుతూనే కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాతలు రాసినా, గుర్తులు ప్రదర్శించినా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఏదేని ప్రచారం చేసినాగానీ యావజ్జీవ శిక్ష విధించేలా ప్రతిపాదనలు చేసింది. తిరుగుబాటులు, యుద్ధం తరహా నేరాలకు జీవతఖైదు విధించేలా చట్టాలను రూపొందించింది. సామూహిక అత్యాచారాల్లో నిందితులకు 20ఏళ్ల జైలు లేదా జీవితఖైదు, మైనర్లపై జరిగే అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే మరణశిక్ష, మూక దాడులకు ఏడేళ్ల జైలు… తీవ్రతను బట్టి జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నారులపై దాడులకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. లైంగిక హింస సంబంధిత కేసుల్లో బాధితుల వాంగ్మూలం, వీడియో రికార్డింగ్ తప్పనిసరి వంటి ప్రతిపాదనలతో కొత్తగా మూడు బిల్లులను హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత చట్టాలతో దేశ నేర న్యాయ వ్యవస్థ కొత్త రూపాన్ని సంతరించుకోనున్నట్లు తెలిపారు. దేశద్రోహం చట్టం రద్దు, మైనర్లపై అత్యాచారాలకు, మూక హత్యల వంటి నేరాల్లో దోషులకు గరిష్ఠంగా మరణశిక్ష విధించేలా ప్రతిపాదనలతో బిల్లులను తెచ్చామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని అన్నారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తూ కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. సత్వరమే న్యాయం అందించడం, తీర్పుల రేటును 90శాతానికి తీసుకెళ్లడమే ఈ చట్టాల లక్ష్యమని అమిత్షా చెప్పారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లు, 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) బిల్లు, 2023Ñ భారతీయ సాక్ష్య (బీఎస్) బిల్లు, 2023ను ప్రతిపాదించారు. భారతీయ శిక్షా స్మృతి (ఐసీసీ) 1860, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఆధారాల చట్టం) 1982 స్థానాన్ని ప్రతిపాదిత చట్టాలు భర్తీ చేస్తాయని అమిత్షా తెలిపారు. వేగవంతమైన న్యాయం అందించేందుకు, దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణమైన న్యాయ వ్యవస్థ ఉండాలనే ఈ ప్రతిపాదనలని చెప్పారు. దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయడానికి, మైనర్లపై అత్యాచారాలు, మూక హత్యల దోషులకు మరణశిక్ష విధించేలా బీఎన్ఎస్ బిల్లులో నిబంధనలు ఉన్నాయని చెప్పారు. చిన్న నేరాలకు సంబంధించిన శిక్షల్లో మొదటిసారి సంఘ సేవ చేయించే ప్రతిపాదన ఉందన్నారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు పొందుపర్చారు. పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నా వారిపై విచారణ జరిపే నిబంధన చేర్చారు. పోలీసులు చేసే సెర్చ్ ఆపరేషన్లలో వీడియోగ్రఫీ, ఏడేళ్లు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫొరెన్సిక్ బృందం వెళ్లి పరిశీలించడం తప్పనిసరి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. న్యాయస్థానాల్లో తీర్పుల నిష్పత్తిను 90శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బిల్లులను రూపొందించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత అమిత్షా మాట్లాడుతూ ‘పాత చట్టాలు 19వ శతాబ్దానికి చెందినవి. అవన్నీ బానిసత్వానికి చిహ్నం. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు! వాటి స్థానంలో ప్రవేశపెట్టనున్న ఈ మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. ఈ బిల్లులు నేర న్యాయవ్యవస్థలో సమూల మార్పులు తెస్తాయని హామీ ఇవ్వగలను’ అని అన్నారు. శిక్ష వేయడం కాకుండా.. న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల లక్ష్యమన్నారు. కొత్త బిల్లులను హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని స్పీకర్ ఓం బిర్లాకు అమిత్షా సూచించారు. ఈ చట్టాల్లో మొత్తంగా 313 మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు.