దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా క్రియాశీలకేసుల సంఖ్య పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసుల సంఖ్య పెరగడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటలవరకు .. గడిచిన 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,097గా ఉంది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. 2020లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోన బారిన పడ్డారు. అప్పటి నుంచి నాలుగేళ్లలో సుమారు 5.3 లక్షల మంది మరణించారు.