జెండాలు, తోరణాలతో అలంకరణ
నేడు రైతు ప్రదర్శనతో ప్రారంభం
విశాలాంధ్ర బ్యూరో – రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలకు రాజమండ్రి నగరం ముస్తాబయింది. ఈ నెల 8`10 తేదీలలో ఈ మహాసభలు జరగనున్నాయి. మహాసభలు విజయవంతంగా నిర్వహించేందుకు ఆహ్వానసంఘం నిర్విరామంగా శ్రమిస్తోంది. నగరాన్ని స్వాగత బ్యానర్లు, ఎరుపు రంగు తోరణాలతో అలంకరించారు రాష్ట్ర నలుమూలల నుంచి అనేకమంది రైతన్నలు , నాయకులు రానున్న దృష్ట్యా ఆహ్వాన కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారు రాజమండ్రి విచ్చేసిన ప్రతి రైతన్నకు ఆతిథ్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు సీపీఐ, ప్రజాసంఘాల కార్యకర్తలు, నేతలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాసభల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం సీపీఐ కార్యాలయం నుంచి రైతుల ర్యాలీతో ప్రారంభమవుతుంది ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సభా వేదిక రివర్స్ బే రిసార్ట్సుకు చేరుకుంటుంది తర్వాత ప్రారంభ సభ జరుగుతుంది. అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు రావుల వెంకయ్య, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివిధ రైతు సంఘాల ప్రముఖులుతమ సందేశాలను ఇచ్చి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు రెండవ రోజు సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితర రైతు నాయకులు పాల్గొని తమ సందేశాలు ఇస్తారు.
మహాసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ తెలిపారు.ఆదివారం ఆయన పాత్రికేయలతో మాట్లాడుతూ ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. యువత వ్యవసాయం చేయలేని పరిస్థితులు పాలక ప్రభుత్వాలు తెచ్చాయన్నారు. దేశంలో ప్రతి రోజు 30 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వృత్తులు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు అనేక వాగ్ధానాలు చేశారు కానీ అమలు చేయలేదన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జరుగుతున్న ఈ మహాసభలలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా తీర్మానాలు చేసుకుని, భవిష్యత్ కార్యచరణ ఈ మహాసభలలో నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ్రపు రాంబాబు, కోశాధికారి వీ కొండలరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి మల్నిడి యల్లమందారావు తదితరులు పాల్గొన్నారు.