16 మంది జల సమాధి
. హరణి సరస్సులో పడవ మునక
. మృతుల్లో 12 మంది చిన్నారులు
. గుజరాత్, వడోదరలో ఘటన
. సీఎం, విద్యామంత్రి దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్, వడోదరలోని హరిణి సరస్సులో పిల్లల బోటు షికారు విషాదాన్ని మిగిల్చింది. 16 మంది జలసమాధి అయ్యారు. న్యూ సన్షైన్ స్కూలుకు చెందిన 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మరణించినట్లు గుజరాత్ అధికారులు ధ్రువీకరించారు. మరో ఏడుగురు పిల్లలను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. న్యూ సన్షైన్ స్కూలు తరపున 23 మంది విద్యార్థులతో పాటు నలుగురు టీచర్లు విహార యాత్రకు వెళ్లారు. సరదగా బోటులో షికారు చేద్దామని భావించారు. అయితే అది మునిగిపోవడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వడోదర నగర అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం భూపేంద్ర పటేల్, విద్యా శాఖ మంత్రి కుబేర్ డిరదోర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. పిల్లల మరణాలు హృదయవిదారకమని ‘ఎక్స్’లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని, ఈ విషాదాన్ని తట్టుకొనే శక్తిని దేవుడు వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. సహాయ, సహకారాలను బాధితులకు అందజేయాలని, ఆసుపత్రుల్లో ఉన్నవారికి ఉత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడిరచారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 27 మంది ఉన్నారని వడోదర జిల్లా కలెక్టర్ ఏబీ గౌర్ తెలిపారు. జాన్వీ ఆసుపత్రిలో తొమ్మిది మరణాలు, సయాజీ ఆసుపత్రిలో మరో మూడు మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడిరచారు. ఘటన గురించి తెలిసిన వెంటనే మేయర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఘటనాస్థలానికి చేరుకొని ఆరా తీశారు.
నిర్లక్ష్యమే పిల్లల ప్రాణాలు తీసింది: ప్రతిపక్ష నేత
నిర్వాహకుల నిర్లక్ష్యమే పిల్లల ప్రాణాలు తీసిందని ప్రతిపక్ష నేత ఒకరు విమర్శించారు. 15 మంది కూర్చునే సామర్థ్యంగల పడవలో 27 మందిని ఎలా ఎక్కిస్తారని ప్రశ్నించారు. కనీసం లైఫ్ జాకెట్లు లేకుండా పిల్లలను పడవలోకి అనుమతించడం ఆక్షేపణీయమన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతులకు రూ.2లక్షల పరిహారం: కేంద్రం
పడవ ప్రమాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా మంజూరు చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.