. మరో ఇద్దరు మంత్రులు కూడా…
. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
. బలపరీక్షకు 10 రోజుల గడువు విధించిన గవర్నర్
రాంచీ: కొద్దిరోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్న జార్ఖండ్లో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మనీలాండరింగ్ కేసులో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్పై ఈడీ విచారణ నేపథ్యంలో… గత రెండు రోజులుగా జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం విదితమే. జనవరి 31న హేమంత్ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం.. కొత్త ముఖ్యమంత్రిగా చంపైని ఎన్నుకోవడం, ఆ తర్వాత హేమంత్ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం వడివడిగా జరిగిపోయాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా కొన్ని గంటల పాటు ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ చివరకు చంపై నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తూ గురువారం అర్ధరాత్రి గవర్నర్ కార్యాలయం నుంచి వర్తమానం అందింది. కాగా 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ చంపై సోరెన్ను ఆదేశించారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది.
హైదరాబాద్కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు…. 5న బల పరీక్ష
చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసినప్పటికీ బలపరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించింది. జార్ఖండ్లోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలందరూ శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు, ఈనెల 5న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి అలంగిర్ ఆలం వెల్లడిరచారు. తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెజార్టీని నిరూపించుకొనేందుకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఫిబ్రవరి 5న బలపరీక్షకు సిద్ధమవుతోందని.. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషన్లో భాగంగా తొలిరోజు బలపరీక్ష జరుగుతుందని చెప్పారు. సీఎం చంపై సోరెన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.