. 15 రోజుల్లో ఐదుగురికి భారతరత్న
. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు
. రాజకీయ ప్రయోజనాలే పరమావధి
. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి సుస్పష్టం
న్యూదిల్లీ : దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’కు రాజకీయ రంగు పులుముకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని కాషాయ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాలే పరమావధిగా, కాంగ్రెస్ వ్యతిరేక వైఖరితో కూడిన రాజకీయ, పాలనాపరమైన చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ‘భారతరత్న’ ప్రకటన కొంత ప్రహసనంగానే కనిపిస్తున్నట్లు విమర్శకులు అంటున్నారు. బీసీ నాయకుడిగా బీహార్ వాసి దివంగత కర్పూరీ ఠాకూర్కు మొదట ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ సమయానికి దేశంలో విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి పటిష్టంగా కొనసాగుతుండటం, బీహార్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడ నితీశ్ నేతృత్వంలోని జేడీయూను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకోవడం వంటి పరిణామాలు కర్పూరీ ఠాకూర్కు అవార్డు ప్రకటన వెనుక కోణాన్ని ఆవిష్కరించింది. అంతకుముందే బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థానంలో రామమందిర నిర్మాణం… అనంతర ప్రారంభ కార్యక్రమాలతో దేశంలో రామజపాన్ని హోరెత్తించడం ద్వారా తన రాజకీయ ప్రచారానికి బీజేపీ పునాదులు వేసుకుంది. అదే క్రమాన్ని కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో ముగ్గురు ప్రముఖులకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్కు, కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించిన పీవీ నరసింహారావు పట్ల ఆ పార్టీ అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై ఉన్న విమర్శలు, ఆరోపణల నేపథ్యాలను అనువుగా తీసుకుని ఆయనకు పురస్కారం ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం తన కాషాయ రాజకీయ వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు చూస్తే, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించింది. ఇది తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. కానీ స్వామినాథన్ రైతుల శ్రేయస్సు కోసం చేసిన సిఫార్సులను మోదీ సర్కార్ ఇంతవరకు పట్టించుకున్నది లేదు. అంతకుముందే తమ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించింది. అదీ తీవ్ర విమర్శలకు దారితీసింది. వామపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని నిందించాయి. ఇదిలాఉండగా 15 రోజుల వ్యవధిలోనే వరుసగా ఐదుగురికి భారతరత్న ప్రకటించి యావత్ దేశ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ గౌరవం అందుకుంటున్న వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక మాజీ ఉప ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు ఉన్నారు. మరణానంతరం నలుగురికి ఈ గౌరవం ఇస్తున్నారు. ఐదుగురి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
భారతరత్న అవార్డులకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే… అతల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం1999లో అత్యధికంగా నలుగురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది. ఒక సంవత్సరంలో నలుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించడం అదే తొలిసారి. ఆ ఏడాదిలో జయప్రకాశ్ నారాయణ్, ఆమర్త్యసేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, రవి శంకర్కు ప్రదానం చేశారు. ఇప్పుడు ఏకంగా ఐదుగురికి ప్రకటించి యావత్ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యానికి గురి చేసింది. భారతరత్న ఎవరికి ఇస్తారు? నిబంధనలు ఏమిటనే విషయాలను చూస్తే… ఒక విభాగంలో ఒకేసారి ముగ్గురి కంటే ఎక్కువ మందికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి అవకాశం లేదు. భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. ఏ రంగంలోనైనా అసాధారణమైన, అత్యున్నత సేవలు అందించినందుకు గుర్తింపుగా ఇవ్వడం ఆనవాయితీ. రాజకీయాలు, కళలు, సాహిత్యం, శాస్త్రవిజ్ఞాన రంగాలలో ఆలోచనాపరులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక సేవకులకు భారతరత్న అవార్డు ప్రదానం చేస్తారు. ‘భారతరత్న’ అవార్డును 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకట రామన్కు తొలిసారిగా 1954లో ఈ గౌరవం లభించింది.