. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే సీఏఏ, ఎన్ఆర్సీ
. గ్రూపు`1 పరీక్ష నిర్వహణలో కుట్ర కోణం
. రైతులందరికీ లబ్ధి చేకూర్చాలి
. హోదాపై నేటి కాంగ్రెస్ సభకు సీపీఐ మద్దతు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాసమస్యలను పరిష్కరించి తద్వారా ఓట్లు పొందాలనే అలోచన చేయకుండా ప్రజల మధ్య చీలిక తీసుకువచ్చి మెజార్టీ ప్రజల ఓట్లు పొంది అధికారం నిలబెట్టుకోవాలని కుయుక్తులకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. స్థానిక దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ హిందువులను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి పదే పదే సీఏఏ, ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ… మైనార్టీలను కించపర్చటానికి యత్నిస్తున్నారు తప్ప ప్రజల సమస్యలపై వారిచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలనే ఆలోచన చేయకపోవటం దుర్మార్గం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 2019 ఎన్నిక సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి దిల్లీస్థాయిలో కేర్రదానికి వ్యతిరేకంగా ధర్నా చేశారని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి తనకు ఎమ్మెల్యే సీట్లతో పాటు అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. తరువాత వైసీపీ, టీడీపీలు రెండూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవటం విచారకరం అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్తో మార్చి ఒకటవ తేదీన చేయ తలపెట్టిన ‘చలో ముఖ్యమంత్రి కార్యాలయం’ ఆందోళనకు సీపీఐ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే విధంగా మార్చి 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. ఆ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తోపాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికైనా ప్రత్యే హోదా అంశంపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా… ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి గ్రూపు1, గ్రూపు 2 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన జగన్… యువతను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూమంత్రంగా డీఎస్సీ, గ్రూపు 1, గ్రూపు 2 పోస్టులు ప్రకటిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 7 లక్షల మంది డీఎస్సీ రాసేందుకు సన్నద్ధం అయ్యారని అనేక మంది శిక్షణ కూడా తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం కేవలం 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. సాక్షాత్తు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గ్రూపు 1, గ్రూపు 2 పరీక్షలను శాస్త్రీయంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తామని సాక్షి పేపర్లో ప్రకటించారని తెలిపారు. సాక్షి పేపర్ ప్రభుత్వ డబ్బులతో నడుస్తోందన్నారు. దీంతో 1,48,880 మంది అభ్యర్థులు సవాంగ్ ప్రకటన మేరకు కొత్త సిలబస్తో పరీక్షకు సిద్ధ మయ్యారని చెప్పారు. ఇప్పుడు పాత సిలబస్ ప్రకారం గ్రూపు1 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించటంపై సందేహం వెలిబుచ్చారు. ప్రభుత్వం తన అనుయాయులకు పాత పద్ధతిలో పరీక్ష ఉంటుందని ముందే చెప్పి ఆ విషయాన్ని పరీక్షలకు ముందు ప్రకటించి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. గ్రూపు1 పరీక్ష నిర్వహణలో మోసం, దగా ఉందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చైర్మన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాత సిలబస్ ప్రకారం గ్రూపు
1 నిర్వహించాలనుకుంటే పరీక్షకు మరో మూడు నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్లు ప్రచారార్భాటం చేశారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వడ్డీ చెల్లింపు కింద రూ.3వేల కోట్లు జమ చేయాల్సి ఉంటే…కేవలం 20శాతం మందికే డబ్బు వేశారని…ప్రచారం మాత్రం వంద శాతం చేశారని ధ్వజమెత్తారు. మిగిలిన 80 శాతం మంది రైతులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు జమ కాలేదని నివ్వెరపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ లబ్ధి చేకూరేలా డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ… కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవటం జరిగిందన్నారు. మార్చి మొదటి వారంలో పొత్తులు, సీట్లపై స్పష్టత ఇవ్వటం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారణం కాదన్నారు. సీపీఎం తప్ప అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా రాతపూర్వకంగా లేఖ ఇచ్చిన తరువాత విభజన ప్రక్రియ వేగవంతం అయిందన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష బీజేపీ మద్దతుతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, రాజధాని నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు తదితర రాష్ట్ర సమస్యలపై అజెండా రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. వైఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సీఎం జగన్మోహన్రెడ్డే కారణం అన్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావటానికి మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన షర్మిలకు ఆ పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ పాల్గొన్నారు.