ఈనెల 20 నుండి 30 వరకు హాస్టళ్లలో నిద్రలు
- పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేయాలి… జీవో 77 రద్దు చేయాలి
. ఆగస్టు 6న కలెక్టరేట్ల వద్ద నిరసన
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి. జాన్సన్ బాబు
విశాలాంధ్ర- విజయనగరం అర్బన్ : వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి ఫణింద్ర కుమార్, జిల్లా కార్యదర్శి ఎస్. నాగభూషణ్ తెలిపారు. స్థానిక అమర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హాస్టల్ సందర్శన ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఆగస్టు 6న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు అంద వలసిన దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు అందలేదని, తొమ్మిది నెలలుగా మెస్ చార్జీలు విడుదల చెయ్యకపోవడంతో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంలో వార్డెన్లు విఫలమవు తున్నారని, దీని వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురై వాళ్ల విద్యాభ్యాసం ప్రశ్నా ర్ధకంగా మారుతోందన్నారు. హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల వల్ల విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేక పోతున్నారని, అందువల్ల ఆన్ లైన్ ప్రవేశాలు రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబరు 77ను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి వాటి స్వయం ప్రతిపత్తి కాపాడాలని, ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ పోస్టులతో పాటు ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు సాయికుమార్, గౌరీ శంకర్, సుమన్, బాబ్జి, భాను, జ్యోతి, జగదీష్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.