. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం
. దిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలో వైసీపీ అధినేత జగన్
. సంఫీుభావం ప్రకటించిన అనేక పార్టీల నాయకులు
విశాలాంధ్ర బ్యూరో – న్యూదిల్లీ: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో అరాచక పాలన, హింసాత్మక పాలన కొనసాగుతుందంటూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్ బుధవారం ధర్నా చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు సంఫీుభావం ప్రకటించాయి. శిబిరం వద్దకు సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ (రాజ్యసభ), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ప్రతినిధులు అబ్దుల్ హవాబ్, హ్యారీస్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీ ముల్ హక్, ఏఐఏడీఎంకే రాజ్యసభ సభ్యులు తంబిదురై, వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు) తిరుమా వలవన్, ఆప్ నాయకులు రాజేంద్రప్రసాద్, శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తదితర పార్టీల నేతలు, ఎంపీలు విచ్చేసి జగన్కు మద్దతు తెలిపారు. గత 45 రోజుల నుంచి కూటమి ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న అరాచక చర్యలు, హత్యలు, దాడులు, బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమైన సంఘటనలకు సంబంధించిన ఫొటో, వీడియో ప్రదర్శనలను ఆయన చూపించారు. ధర్నాకు ముందు జాతీయ మీడియాతో జగన్ మాట్లాడారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజులుగా అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోందని, అంతులేని దారుణాలు జరుగుతున్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. వైసీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయిందని, అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. 30 మందికి పైగా హత్యలు జరిగాయని, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని వివరించారు. 560 చోట్లకు పైగా ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్బుక్ రాజ్యాంగం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవాలని ఆకాంక్షించారు.
బీజేపీ… నేరమయ సంఘటనలు సమర్దించొద్దు : ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
జగన్కు మద్దతు తెలిపిన అనంతరం అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ నేరమయ రాజకీయాలు చేయకూడదని, ఇలాంటి ఘటనలను సమర్థించొద్దు అని సమాజ్వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ సూచించారు. ఏపీలో బుల్డోజర్ సంస్కృతి దేనికి సందేశమని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్ సంస్కృతిని మా సమాజ్వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదని, దాన్ని తప్పు పడుతున్నామని చెప్పారు. ఒకవేళ నన్ను జగన్ ఆహ్వానించి ఉండకపోయి ఉంటే, నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే… నాకు ఇన్ని వాస్తవాలు తెలిసి ఉండేది కాదని అన్నారు. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం, ఎన్నికయిన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదని ఖండిరచారు. జగన్కు మా మద్దతు ఉంటుందని, ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చు అని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా దేశ ద్రోహ కేసులు నమోదు చేయాలన్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు రామ్గోపాల్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో ఇంత దారుణం జరుగుతుంటే, రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది?, గవర్నర్ ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు) తిరుమా వలవన్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ముఖ్య నాయకుల ఆదేశాల మేరకే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదొరై మాట్లాడుతూ ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
శివసేన (యూబీటీ) నాయకులు సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు, నేతలు అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. జగన్తో పాటు పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆర్వీ కృష్ణయ్య యాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.