Friday, May 3, 2024
Friday, May 3, 2024

నాఫ్కాబ్ డైరెక్టర్ గా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఎన్నిక

విశాలాంధ్ర – విజయవాడ : అర్బన్ బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీల జాతీయ సమాఖ్య (నాఫ్కాబ్-నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్) డైరెక్టర్ గా ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆడిటోరియంలో సోమవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో రాఘవేంద్రరావు 211 ఓట్లు సాధించారు. నాఫ్కాబ్కు మొత్తం వివిధ కేటగిరీల నుంచి 19 మంది డైరెక్టర్లు ఎన్నిక కావాల్సి వుండగా, ఇప్పటికే 12 మంది ఏకగ్రీవమయ్యారు. అర్బన్ బ్యాంకులకు కేటాయించిన 7 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నిక జరిగింది. జాతీయ సమాఖ్య మార్గదర్శకులు చైర్మన్ ఎమిరిటస్, కర్నాటక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్.కె. పాటిల్, నాఫ్కాబ్ ప్రస్తుత అధ్యక్షులు జ్యోతేంద్రభాయి మెహతా నాయకత్వంలో దేశంలో వివిధ రాష్ట్రాల ఫెడరేషన్ల మద్దతుతో “సహకార్ సే సమృద్ధి 24” ప్యానల్ నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చలసాని రాఘవేంద్రరావు అత్యధికంగా 211 ఓట్లతో గెలుపొందారు.
చలసానితోపాటు ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి, అజాద్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, ఎ.ఎం. హిందాస్ గిరి, ది కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, సి.ఎ. మిలింద్ కాలే (మహారాష్ట్ర), బార్దోలీ నాగ్రిక్ సహకారి బ్యాంక్ చైర్మన్ గౌతమ్ బాయ్ వ్యాస్ (గుజరాత్), అకోల జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జియాన్ చంద్ గార్గ్ (మహారాష్ట్ర), ప్రస్తుత నాఫ్కాబ్ డైరెక్టర్ కె. కాలప్ప (కర్నాటక), వర్ఛ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కంజీభాయ్ బలాలా (గుజరాత్)లు నూతన డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.
సోమవారం జరిగిన పోలింగ్ లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి 230 ఓట్లు పోలవ్వగా, 8 ఓట్లు చెల్లలేదు. గెలుపొందిన ఏడుగురు డైరెక్టర్లలో అకోల జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జియాన్ చంద్ గార్గ్ 212 సాధించి మొదటి స్థానంలో నిలవగా, రాఘవేంద్రరావు 211 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. దేశంలోని సుమారు 1500కు పైగా అర్బన్ సహకార బ్యాంకుల్లో వివిధ విభాగాల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన విశాఖపట్నం కో ఆ-ఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధికి డైరెక్టర్ స్థానం ఇవ్వాలన్న నాఫ్కాబ్ పెద్దల సమష్టి ఆలోచనలతో చలసాని ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 5 సంవత్సరాలపాటు కొనసాగనున్నారు.
కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన చలసాని రాఘవేంద్రరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులుగా, ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాజీ శాసన సభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు నేత శ్రీ మానం ఆంజనేయులుగారు 1983లో ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు పురోభివృద్ధికి చలసాని కృషి చేస్తున్నారు. 1993లో తొలిసారి బ్యాంకు డైరెక్టర్ గా ఎన్నికైన ఆయన 2006 నుంచి 2013 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానూ సేవలందించారు.
మానం ఆంజనేయులు 2013లో చైర్మన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగడంతో
20 ఏళ్లపాటు బ్యాంకు డైరెక్టర్ గా కొనసాగుతున్న చలసాని రాఘవేంద్రరావు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 30 ఏళ్ళపాటు చైర్మన్ గా కొనసాగిన మానం ఆంజనేయులు సారథ్యంలో బ్యాంకు ఆర్థిక లావాదేవీలు కోటి రూపాయల నుంచి రూ.3,169 కోట్లకు చేరగా, ప్రస్తుత బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు హయాంలో రూ. 7,263.66 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంక్గా అవిర్భవించింది.
సహకార స్పూర్తితో బ్యాంకును పురోభివృద్ధి దిశలో నడిపిస్తున్న చలసాని 20 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సహకార అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల బలోపేతానికి కృషి చేస్తున్నారు. అనేక సందర్భాలలో అర్బన్ బ్యాంకుల సమస్యలను ఆర్బీఐ ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళిన రాఘవేంద్రరావు నాఫ్కాబ్ డైరెక్టర్ గా ఎన్నికవ్వడం సహకార వ్యవస్థ మరింత బలోపేతానికి ఉపయోగపడుతుంది. విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకుకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకురావటానికి బాటలు వేసిన మానం అంజనేయులు. 30 ఏళ్ళపాటు నాఫ్కాబ్ డైరెక్టర్ గా, ఉపాధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించి సహకారరంగ ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. ఆయన శిష్యులు చలసాని రాఘవేంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్గా ఎన్నిక కావడం విశాఖపట్నం కో- ఆపరేటివ్ బ్యాంకు ప్రతిష్ఠను మరింత పెంచింది. కార్మికోద్యమ నాయకులుగా ప్రజా ఉద్యమాల్లో ముందు నిలిచిన చలసాని రాఘవేంద్రరావు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతున్నారు.

సహకార వేత్తల అభినందనల వెల్లువ
ఢిల్లీలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన డైరెక్టర్ ఎన్నికల్లో 211 ఓట్లతో గెలుపొందడంతో పాటు అత్యధిక ఓట్లు సాధించిన రాఘవేంద్రరావును తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సహకార వేత్తలు అభినందనలతో ముంచెత్తారు.
రాఘవేంద్రరావుకు విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు మార్గదర్శకులు మానం ఆంజనేయులు ఫోన్లో ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏపీ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, వాణి కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వెంకటరత్నం, గుత్తి కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జిలాని, అనంతపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మురళి, జాంపేట కో- ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జయ కుమార్, గుంటూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసరావు, ఏలూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అర్బన్ బ్యాంకుల చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లు చలసానికి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img